వ్యభిచారి.. వైసీపీ ఎంపీపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు..
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. వ్యభిచారంలో సిద్దహస్తుడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల మాధవ్ చంద్రబాబు నాయుడును విమర్శించటం హాస్యాస్సదమని అన్నారు. గోరంట్ల మాధవ్ బెదిరింపుల వల్లే కియా అనుబంధ సంస్ధలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే నెలకొందన్నారు. మాధవ్ తీరుతో విసిగిపోయిన హిందూపురం ప్రజలు 2024 ఎప్పుడు వస్తుందా... అక్కడి నుంచి ఎప్పుడు తరిమేద్దామా అని ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడారు.
బుద్దా వెంకన్న సవాల్..
గోరంట్ల మాధవ్ ఎంత అవినీతిపరుడో... ఆయన పనిచేసిన ప్రతీ పోలీస్ స్టేషన్లో చెప్తారని బుద్దా అన్నారు. అమరావతి రెపరెండంపై విశాఖ జిల్లాలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను అవంతి రాజీనామా చేయమంటున్నారని.. ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు గుంటూరు ఎంపీ కూడా రాజీనామాకు సిద్దమని అన్నారు. అయితే అమరావతి ప్రాంతంలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు రాజీనామా చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. అవంతికి చేతనైతే వారిని రాజీనామాకు ఒప్పించాలని సవాల్ విసిరారు.
విశాఖలో కబ్జా భూముల కోసమే..
వైసీపీ నేతలు కబ్జా చేసిన భూముల కోసమే విశాఖలో రాజధాని పెడుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. విశాఖలో విలువైన భూములను జగన్ ఇప్పటికే విజయసాయిరెడ్డి ద్వారా కబ్జా చేయించారని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే ఆనాడు రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకున్నారని అన్నారు. కానీ నేడు విశాఖ రాజధాని అనగానే.. వైసీపీ నేతల భూకబ్జాలతో అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారని ఆరోపించారు.
అయ్యన్నపాత్రుడు ఆరోపణలు
అంతకుముందు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా విశాఖలో భూకబ్జాలపై వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. రాజధాని పేరుతో వైసీపీ భూఅక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాల కారణంగా విశాఖకు రావాల్సిన లులు గ్రూపు,ఆదాని గ్రూపు వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. జగన్ ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి విశాఖలో మకాం వేసి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
టీడీపీ నిజ నిర్దారణ కమిటీ..
విశాఖలో భూకబ్జాలపై నిజానిజాలను తేల్చేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో విశాఖలో జరిగిన భూకబ్జాలపై ఒక కమిటీ విచారణ చేయనుంది. అయితే ఈ కమిటీపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కమిటీ వేయాల్సింది అమరావతిలో అని ఎద్దేవా చేస్తున్నారు. లేనిపోని అసత్యాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో భూకబ్జా మాఫియా కంట్రోల్లోకి వచ్చిందంటున్నారు.