అర్ధరాత్రి బాబు నిర్ణయం: లోకేష్, బలరాం సహా ఏపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
ఏపీ శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ముఖ్యమంత్రి, టిడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఖరారు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (చిత్తూరు), టీడీపీ సీనియర్
అమరావతి: ఏపీ శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ముఖ్యమంత్రి, టిడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఖరారు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (చిత్తూరు), టీడీపీ సీనియర్ నేతలు కరణం బలరాం, పోతుల సునీత (ప్రకాశం), డొక్కా మాణిక్యవరప్రసాద్ (గుంటూరు), బచ్చుల అర్జునుడు (కృష్ణా)లకు అవకాశం కల్పించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో లోకేశ్ సోమవారం ఉదయం వెలగపూడిలోని అసెంబ్లీలో ఉదయం 10.39 గంటలకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన నాగుల్ మీరా(గుంటూరు)కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేనందున పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన వారికే ఎక్కువ మందికి ఈసారి అవకాశం రావడం విశేషం. నారా లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేశారు. పార్టీ పట్ల విధేయత, దీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉండటంతో పాటు అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్తో ఉన్న రాజకీయ ఇబ్బందుల్ని పరిష్కరించే లక్ష్యంతో కరణం బలరాంకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
కాగా, పోతుల సునీత మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారు. చీరాల నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గానికి చెందినవారు ఎక్కువగా ఉండటంతో గత శాసనసభ ఎన్నికల్లో ఆమెను అక్కడినుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె తర్వాత పార్టీ నియోజకవర్గ బాధ్యురాలిగా కొనసాగారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి రావడంతో వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. వాటిని పరిష్కరించడంతోపాటు బీసీ, మహిళా విభాగాలు కూడా కలసి వచ్చేలా సునీతను ఎంపిక చేశారు.
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. పార్టీకి ఆయన సేవలు అవసరమని భావించడంతో పాటు తాడికొండ నియోజకవర్గంలో రాజకీయ ఇబ్బందులు లేకుండా చూసేందుకు అవకాశం ఇచ్చారు. బీసీ కోటాలో కృష్ణాజిల్లా తెదేపా అధ్యక్షుడిగాఉన్న బచ్చుల అర్జునుడికి అవకాశం కల్పించారు.