మండలి రద్దు బిల్లు లోక్సభ సమక్షానికి రాకుండా: టీడీపీ పావులు..హైకోర్టులో మరో పిటీషన్
అమరావతి: రాష్ట్ర శాసన మండలి రద్దు వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తాను పట్టిన పట్టు విడవట్లేదు. మండలిని రద్దు చేయడానికి ఉద్దేశించిన బిల్లను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలను సాగిస్తోంది. ఇందులో భాగంగా- మరోసారి హైకోర్టును ఆశ్రయించింది టీడీపీ. మరోసారి పిటీషన్ను దాఖలు చేసింది. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశ పెట్టిన మండలి రద్దు బిల్లును అడ్డుకోవాలని విజ్ఙప్తి చేసింది. లోక్సభ, రాజ్యసభలల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని కోరడం హైలైట్గా భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు దీపక్ రెడ్డి ఈ పిటీషన్ను దాఖలు చేశారు.హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. తనకు ఉన్న సమాచారం ప్రకారం...ఏపీ శాసన మండలి రద్దు బిల్లు త్వరలోనే పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయని దీపక్ రెడ్డి ఈ పిటీషన్లో పేర్కొన్నారు. లోక్సభ, రాజ్యసభ సమక్షానికి ఈ బిల్లు రాకుండా అడ్డుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ, లోక్సభ, రాజ్యసభ కార్యదర్శులకు ఆదేశాలను జారీ చేయాలని కోరారు.
దీనితోపాటు- రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును వైఎస్ జగన్ ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో పునః ప్రవేశపెట్టడాన్ని కూడా దీపక్ రెడ్డి తప్పు పట్టారు. ఇదివరకే హైకోర్టులో ఉన్న బిల్లులను రద్దు చేయాలంటూ అధికార పార్టీ ఏ విధంగా శాసనసభలో ప్రవేశపెట్టగలుగుతుందని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన దాఖలు చేసిన ఈ పిటీషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపో, మాపో విచారణకు రానుంది.
వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: కలకలం: అసెంబ్లీ సమావేశాలకు హాజరు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు
Recommended Video
ప్రస్తుతం శాసన మండలి రద్దు బిల్లు హైకోర్టులో విచారణ దశలో ఉంది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా భావించే పార్లమెంట్లో కూడా ఈ బిల్లును ప్రవేశ పెట్టకుండా అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తాజాగా చేస్తోన్న ప్రయత్నాల పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని, ఎంతకైనా దిగజారుతుందని అనడానికి ఇదే నిదర్శనమని మండిపడుతున్నాయి. హైకోర్టు ద్వారా శాసన మండలి రద్దు బిల్లు పార్లమెంట్ సమక్షానికి రాకుండా అడ్డుకోవాలనుకోవడం టీడీపీ నేతల అవివేకమని వ్యాఖ్యానిస్తున్నారు.