డొక్కా మాణిక్యవర ప్రసాద్ రాజీనామా: మరో ఎమ్మెల్సీ పైనా..: వైసీపీ వ్యూహంలోనే..!
Recommended Video
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ ఆమోదించటంతో..మండలిలో సైతం ఆమోదం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. సభలో దీని పైన టీడీపీ ముందుగా 71 సెక్షన్ కింద తీర్మానం పైన చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది.
ఆ తరువాతనే మూడు రాజధానుల బిల్లు పైన చర్చ చేయాలని డిమాండ్ చేసింది. దీనికి ఛైర్మన్ అంగీకరించారు. ఇక..ఇది కొనసాగుతున్న సమయంలోనే టీడీపీ ఎమ్మెల్సీలు ఇద్దరు సభకు గైర్హాజరయ్యారు. పార్టీ విప్ జారీ చేసినా సభ్యులు గైర్హాజరు కావటం పార్టీలో టెన్షన్ కు కారణమవుతోంది. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసారు. అదే విధంగా మరో ఎమ్మెల్సీ తీరు సైతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
డొక్కా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అనుంగు శిష్యుడుగా ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరాలని భావించారు. అయితే, రాయపాటి ఒత్తిడి మేరకు ఆయనతో కలిసి టీడీపీలో చేరారు. దీంతో..టీడీపీలో డొక్కాకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. నామినేటెడ్ పోస్టును కేటాయించారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుండి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజా ఎన్నికల ఫలితాల తరువాత గతం లో వలే డొక్కా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా వ్యవహరించటం లేదు.
వ్యతిరేకించాలని ఎమ్మెల్సీలందరికీ
ఇక, ఇప్పుడు రాజధానుల వ్యవహారం విషయంలో ఆయన అమరావతికి మద్దతు గా నిలిచారు. ఈ రోజు శాసనమండలిలో ప్రభుత్వ బిల్లును వ్యతిరేకించాలని ఎమ్మెల్సీలందరికీ పార్టీ విప్ జారీ చేసింది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ..తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాంటూ డొక్కా టీడీపీ అధినేతకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే, తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ కు పంపకుండా చంద్రబాబుకు పంపటం పైన చర్చ సాగుతోంది.
నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే..రాజీనామా దేనికి
డొక్కా మాణిక్య వర ప్రసాద్ తన రాజీనామాకు చెబుతున్న కారణం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతరేకిస్తున్నానని డొక్కా తాను చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే, మూడు రాజధానులను వ్యతిరేకిస్తే అందుకు అనుగుణంగా పార్టీ నిర్ణయానికి మద్దతుగా వ్యతిరేక ఓటు వేయాల్సిన సమయంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకు న్నారనే చర్చ సాగుతోంది. అదే సమయంలో మరో ఎమ్మెల్సీ ..అనంతపురం జిల్లాకు చెందిన శమంతకమణి సైతం మండలికి గైర్హాజరయ్యారు.
డొక్కా చెబుతున్న కారణాలు
అయితే, అనారోగ్య కారణాల వలనే హాజరు కాలేదని తెలుస్తోంది. డొక్కా చెబుతున్న కారణాలు..సమయం పైనే ఇప్పుుడు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ తమ పార్టీ ఎమ్మెల్సీలతో టచ్ లో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. మండలిలో సైతం యపమల ఇదే అంశాన్ని నిలదీసారు. తమ పార్టీ ఎమ్మెల్సీలకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో..వైసీపీ వ్యూహం ఈ ఎమ్మెల్సీల మీద ప్రభావం చూపిస్తోందా అనే చర్చ సాగుతోంది.