రాహుల్ అర్జునుడు కాదు, ఉత్తర కుమారుడే: గాలి, కర్నూలులో అశోక్ బాబుకు పరాభవం
తిరుపతి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అర్జునుడు కాదని, ఉత్తర కుమారుడేనని టీటీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యల గురించి రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై ఆయన ఎందుకు పాదయాత్రలు చేయడం లేదని ప్రశ్నించారు. కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలపై ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ తమ పాలనలో 2.80 లక్షల ఎకరాలను సెజ్ పేరుతో దారాదత్తం చేశారని తెలిపారు.
కర్నూలులో అశోక్ బాబుకు పరాభవం
ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబుకు కర్నూలులో పరాభవం ఎదురైంది. ఓ అభినందన సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను విద్యార్ధులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభనకు అనకూలంగా వ్యవహరించారని ఆయనపై విద్యార్ధి సంఘం నేతలు తిరగబడ్డారు.
ఈ క్రమంలో విద్యార్ధి సంఘం నేతలకు, ఉద్యోగ సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్నాయి. పోలీసులు రంగంలోకి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు.