అపాయింట్మెంట్ నిరాకరించిన అమిత్ షా: ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు: వెంకయ్య నాయుడితో భేటీ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటోన్న సంచనల నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి రెడీ అవుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో అమరావతి రైతులు కొనసాగిస్తోన్న పోరాటాన్ని ఇప్పటికే ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లిన టీడీపీ.. ఇక శాసన మండలిని ప్రొరోగ్ చేయడంపై హస్తిన పెద్దల దృష్టికి తీసుకెళ్లబోతోంది. దేశ రాజధానిని కేంద్రంగా చేసుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రెండురోజుల పాటు వారు ఢిల్లీలోనే ఉండనున్నారు.
కర్నూలుకు వైఎస్ జగన్: న్యాయ రాజధానిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా.. !
Recommended Video
ఉప రాష్ట్రపతితో భేటీ..
శాసనసభ, శాసన మండలిని ప్రొరోగ్ చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మొదలుకుని, రాష్ట్రపతి దాకా అందర్నీ కలుసుకోనున్నారు టీడీపీ ఎమ్మెల్సీలు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లను కలుసుకోనున్నారు. వారికి వినతిపత్రాలను అందజేయనున్నారు. ప్రస్తుతానికి టీడీపీ ఎమ్మెల్సీలకు వెంకయ్య నాయుడి అపాయింట్మెంట్ మాత్రమే లభించినట్లు తెలుస్తోంది.
అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా..
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, నరేంద్ర మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ ఇంకా దొరకలేదని సమాచారం. ప్రస్తుతానికి వెంకయ్య నాయుడి అపాయింట్మెంట్ మాత్రమే లభించింది. దీనితో టీడీపీ ఎమ్మెల్సీలు మంగళవారం ఆయనను కలుస్తారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి షెడ్యూల్కు అనుగుణంగా వారికి అపాయింట్మెంట్ లభించే అవకాశం ఉంది. అమిత్ షా మాత్రం ఉద్దేశపూరకంగానే వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను కలుసుకోవడానికి ఆయన ఏ మాత్రం సుముఖంగా లేరని చెబుతున్నారు.
అమిత్ షాను కలిస్తేనే..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మండలిలో టీడీపీ సభాపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు సారథ్యంలో వారంతా న్యూఢిల్లీకి ప్రయాణం కానున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి 23 మంది సభ్యులు ఉన్నారు. వారంతా ఢిల్లీకి వెళ్తారా? లేక మరి కొందరు ఆగిపోతారా? అనేది తెలియ రావాల్సి ఉంది. అమిత్ షా అపాయింట్మెంట్ లభించికపోతే చివరి నిమిషంలో వాయిదా పడటానికి కూడా అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అమిత్షాను కలిస్తేనే.. తమ లక్ష్యం నెరవేరుతుందని అంటున్నారు. లభించిన తరువాతే ఢిల్లీ వెళ్లాలనే అభిప్రాయం మెజారిటీ ఎమ్మెల్సీల్లో వ్యక్తమౌతోందని చెబుతున్నారు.
ప్రొరోగ్ చేయడాన్ని నిరసిస్తూ..
రాష్ట్ర శాసన సభ, శాసన మండలిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రొరోగ్ చేసిన విషయం తెలిసిందే. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ ఆయన గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసనసభ, మండలిని ప్రొరోగ్ చేసిన నేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) రద్దు బిల్లుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకుని రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిఫారసుల మేరకే గవర్నర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనేది తెలుగుదేశం పార్టీ వాదన.