జగన్ ఢిల్లీ టూర్పై లోకేష్ సోషల్ మీడియా పోల్- కేసులే కారణమన్న నెటిజన్లు
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్కు వెళ్లారు. ఈ టూర్లో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్షాతో పాటు జల్శక్తి మంత్రి గజేంద్ర షెకావత్తోనూ సమావేశమయ్యారు. ఈ టూర్లో జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే విపక్ష టీడీపీ నేతలు మాత్రం జగన్ ఢిల్లీ టూర్ తన కేసుల కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదని విమర్శలు గుప్పిస్తున్నారు.
సీఎం జగన్ ఢిల్లీ టూర్పై టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ట్విట్టర్, ఫేస్బుక్లో ఇవాళ ఒపీనియన్ పోల్ నిర్వహించారు. ఇందులో ఆయన జగన్ ఢిల్లీ పర్యటనపై స్పందించాలంటూ నెటిజన్లను కోరారు. మూడు ఆప్షన్లను ఆయన అందుబాటులో ఉంచారు. అందులో మొదటిది కేసుల మాఫీ కోసమా ? రెండవది బాబాయ్ హత్య కేసులో సీబీఐకి దొరికిన ఇంటి హంతకులను కాపాడేందుకా ? , మూడవది ప్రత్యేక హోదాని ప్రత్యేక విమానంలో తేవడానికా అని లోకేష్ ఆప్షన్లు ఉంచారు. ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న రహస్యమేంటో సమాధానం ఇవ్వాలని లోకేష్ వేసిన ప్రశ్నపై నెటిజన్లు స్పందించారు.
ఓటింగ్లో పాల్గొన్న నెటిజన్లలో 70 శాతం మంది కేసుల మాఫీ కోసమే అన్న ఆప్షన్కు ఓటేశారు. అలాగే 5 శాతం మంది బాబాయ్ హత్య కేసు నిందితుల కోసం అనే ఆప్షన్కు, 24 శాతం మంది ప్రత్యేక హోదా కోసమంటూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో కేసుల మాఫీ కోసమే జగన్ ఢి్ల్లీ వెళ్లారనే అంశాన్ని టీడీపీ నేతలు జనంలో వైరల్ చేస్తున్నారు. గతంలో జగన్ ఢిల్లీ టూర్ల సమయంలోనూ టీడీపీ నేతలు ఇవే విమర్శలు చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ కేసుల మాఫీ కోసమే ఢిల్లీకి అంటూ ప్రచారం చేస్తున్నారు.