టీడీపీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి: వైఎస్ఆర్ సీపీలో చేరడం లాంఛనమే
ఒంగోలు: ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తాను పార్టీని వీడుతున్నానని, రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని ఏకవాక్యంగా రాశారు. ఈ విషయాన్ని ఆయన ఒంగోలులో తన సొంత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
దీనితో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక లాంఛనప్రాయమే. ఆయన పార్టీలో చేరితే.. ఒంగోలు లోక్ సభ స్థానాన్ని కేటాయిస్తామని ఇదివరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
చిక్కుల్లో వైసిపి : బీజేపీతో రహస్య సంబంధాలు :టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్...!
ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి బలమైన నాయకుడిగా పేరుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఒంగోలు నియోజకవర్గం నుంచి మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల సమయంలో మాగుంట.. తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. అప్పటి ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డితో చేతిలో మాగుంట ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయనకు టీడీపీ శాసన మండలికి పంపించింది.
కొంతకాలంగా ఆయన టీడీపీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పొరుగునే ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గ నాయకుల జోక్యం ప్రకాశం జిల్లా టీడీపీలో అధికమైందంటూ ఆయన చెబుతూ వస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఫలితం రాలేదని మాగుంట వర్గీయులు అంటున్నారు. దీనితో-పార్టీని వీడటమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. ఒంగోలు లోక్ సభ స్థానాన్ని తనకు కేటాయించాలనే ఒకే ఒక్క షరతు పెట్టారని, దానికి వైఎస్ఆర్ సీపీ నాయకులు అంగీకరించారు. అంతేకాకుండా- పార్టీలోకి చేరడమంటూ జరిగితే.. మాగుంటకే ఒంగోలు లోక్ సభ స్థానం ఇస్తామని జగన్ అధికారికంగా వెల్లడించారు కూడా. దీనితో గురువారం ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.
బుజ్జగించిన చంద్రబాబు
రాజీనామా నిర్ణయాన్నిప్రకటించడానికి మాగుంట.. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పలుమార్లు బుజ్జగించినప్పటికీ.. ఆయన అంగీకరించలేదని చెబుతున్నారు. తాను రాజీనామా చేయడానికి గల కారణాలను ఇదివరకే చంద్రబాబును కలిసి వివరించినప్పటికీ.. ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదని, తీరా పార్టీని వీడే సమయంలో బుజ్జగించడం సరికాదని మాగుంట వర్గీయులు చెబుతున్నారు.