నా తడాఖా రేపు చూపిస్తా: నారా లోకేశ్ సవాల్.. తల విశాఖలో, కాళ్లు కర్నూలు, శవం అమరావతిలోనా?
తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటుపై పట్టుదలో ఉన్న వైసీపీ సర్కారు ఆ మేరకు తొలిరోజే అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ అథారిటీ, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాయి. వైసీపీకి 151 మంది సభ్యుల బలముంది కాబట్టి ఈ మూడు బిల్లులు అసెంబ్లీలో ఈజీగానే గట్టెక్కుతాయి. కానీ శాసన మండలిలో మాత్రం ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. దీనిపైనే టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రభుత్వానికి సవాలు విసిరారు.
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత: దూసుకొచ్చిన రైతులు: తోపులాట...లాఠీఛార్జ్...!
మండలిలో చుక్కలే..
రాజధాని విభజనకు సంబంధించి ఏపీ సర్కార్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులు.. మంగళవారం శాసన మండలికి చేరనున్నాయి. మండలిలో అధికార వైసీపీ కంటే టీడీపీకే బలం ఎక్కువ. దీంతో బిల్లుల్ని అడ్డుకుని తీరుతామని లోకేశ్ చెప్పారు. అమరావతిలో టీడీపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఎమ్మెల్సీలు అందరం ఒకే మాట మీద నిలబడాలని నిర్ణయించుకున్నాం. ‘ఒక రాష్ట్రం.. ఒక రాజధాని.. జై అమరావతి‘ నినాదానికి కట్టుబడి ఉంటాం. ప్రజావ్యతిరేక బిల్లుల్ని ఎలా అడ్డుకోవాలో మాకో వ్యూహముంది. నా తడాఖా ఏంటో రేపు మీరే చూస్తారు''అని లోకేశ్ సవాలు విసిరారు.
అభివృద్ధి జరగదు.. మేమే చూపించాం
ప్రపంచంలో ఏ దేశంకానీ, దేశంలోని ఏ రాష్ట్రంకానీ పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి చెందిన దాఖలాలు చరిత్రలో లేవని నారా లోకేశ్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణతో స్థానికులు అభివృద్ధి చెందుతారని, గత ఐదేళ్లలో ఏపీలో, అంతకుముందు సైబరాబాద్ లో అలా చేసి చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని గుర్తుచేశారు.
పసిబిడ్డ శవం బతుకుతుందా?
గత 34 రోజులుగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా.. తుగ్లక్ సీఎం జగన్ పట్టించుకోవడంలేదని, పైగా రోజుకో మాట చెబుతూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. పసిబిడ్డ లాంటి రాజధానిని పొడిచి చంపేసి.. తల వైజాగ్ లో, కాళ్లూ చేతులు కర్నూలులో, శవాన్ని అమరావతిలో పెడతామంటే బిడ్డ బతుకుతుందా? అని ప్రశ్నించారు.
వైసీపీ యూటర్న్..
కేబినెట్ సమావేశం ఇంత రహస్యంగా జరుపుకోవాల్సిన అవసరమేంటో అర్థం కావడంలేదని, మంత్రులు మాత్రం తాము చెప్పదల్చకున్నది చెప్పేసి వెళ్లిపోతున్నారని లోకేశ్ విమర్శించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై న్యాయవిచారణకు టీడీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని, దానిపై వైసీపీ ప్రభుత్వమే యూటర్న్ తీసుకుని.. ఇప్పుడు లోకాయుక్త విచారణ అంటోందని లోకేశ్ ఎద్దేవా చేశారు.