నారా లోకేష్ మెడకు సెల్ఫోన్ ఉచ్చు: మండలి సమావేశాల చిత్రీకరణ: నోటీసులను జారీ చేయాలంటూ.. !
Recommended Video
అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు, మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. శాసనమండలిలో వాడివేడిగా చర్చ కొనసాగుతున్న సమయంలో.. దానికి సంబంధించిన సన్నివేశాలను ఆయన తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మంత్రులు పోడియం వైపు దూసుకెళ్లిన సమయంలో..
ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చ కొనసాగుతున్న సమయంలో నారా లోకేష్ తన స్థానం నుంచి లేచి నిల్చుని మరీ సమావేశాల తీరుతెన్నులను తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఏపీ వికేంద్రీరణ బిల్లుపై రూల్ 71 కింద చర్చించడానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంబంధించిన చర్చ అది. తెలుగుదేశం సభ్యుల వైఖరికి నిరసనగా, ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా శాసన మండలిలో మంత్రులు పోడియంలోకి దూసుకెళ్లిన సందర్భం అది.
మంత్రుల నిరసనలను ఫోన్లో
ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యానారయణ సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మండలి ఛైర్మన్ స్థానం వద్దకు దూసుకెళ్లి, తమ నిరసలను తెలియజేసిన దృశ్యాలను నారా లోకేష్.. తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్ర ప్రసాద్, దీపక్ రెడ్డి, తిరుమల నాయుడు వంటి సభ్యుల ప్రసంగాలు, వారు నిల్చుని మంత్రుల తీరును తప్పుపట్టడాన్ని మొబైల్ ఫోన్లోల బంధించినట్లు తెలుస్తోంది.
ఈ వైఖరిపై మంత్రులు ఆగ్రహం..
దీన్ని గమనించిన మంత్రులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు మండలిలోనే నారా లోకేష్ను తప్పు పట్టారు. ఈ విషయాన్ని ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం షరీఫ్ మందలించడంతో నారా లోకేష్ తన ప్రయత్నాలను విరమించుకున్నారు. తన స్థానంలో కూర్చుండిపోయారు. అప్పటికప్పుడు ఈ వివాదం కాస్తా సద్దుమణిగినప్పటికీ.. ప్రభుత్వం దీన్ని తీవ్రమైన చర్యగా పరిగణిస్తోంది. మండలి నిబంధనలను ఉల్లంఘించినట్లు భావిస్తోంది. చర్యలు తీసుకోవాలని ఛైర్మన్కు ఫిర్యాదు చేయబోతోంది.
ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేసినందుకే..
వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా శాససన మండలిలో గందరగోళం వాతావరణం నెలకొన్న సమయంలో తాత్కాలికంగా ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఈ విషయం తెలిసిన తరువాతే నారా లోకేష్.. తన మొబైల్ ఫోన్లో సమావేశాలను చిత్రీకరించినట్లు చెబుతున్నారు. ప్రత్యక్ష ప్రసారాలను నిలపివేయడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. సమావేశాల తీరును బాహ్య ప్రపంచానికి తెలియనివ్వకుండా అధికార పార్టీ ఉద్దేశపూరకంగా ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేసిందని, అందుకే తాము మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాల్సి వచ్చిందని నారా లోకేష్ చర్యలను టీడీపీ సభ్యులు సమర్థిస్తున్నారు.