జగన్ కుటుంబంలో విభేదాలు...విజయమ్మ,షర్మిలే కుట్ర చేసి ఉంటారు:టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
విజయవాడ:టిడిపి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి అధ్యక్షుడు జగన్పై దాడి గురించి ఆయన ఈ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ పై దాడి వెనుక తమకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయన్నారు రాజేంద్రప్రసాద్. జగన్ కుటుంబంలో చాలా విభేధాలు ఉన్నాయని, ఆ గొడవలే జగన్ పై హత్యాయత్నానికి కారణమని తాము భావిస్తున్నామని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. జగన్ మరణిస్తే ఆ సానుభూతి ఓట్లతో గద్దె ఎక్కాలని విజయమ్మ, షర్మిల కుట్రపన్నారనే అనుమానం కలుగుతోందని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.
జగన్ పై దాడి చేస్తే టిడిపికి ఏమి లాభమని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. జగన్ తన తల్లి వైఎస్ విజయలక్ష్మి, సోదరి షర్మిలను అణగదొక్కుతున్నారని, ఆ నేపథ్యంలో జగన్ కుటుంబంలో చాలా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఈ జగన్ చనిపోతే పార్టీ పగ్గాలు చేపట్టాలని, సిఎం అవాలనే కోరికతో వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఉందనే అనుమానాన్ని రాజేంద్రప్రసాద్ వ్యక్తం చేశారు. ఈ దిశగా కూడ పోలీసులు విచారణ జరిపించాలని ఆయన కోరారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు పిచ్చికుక్క కరిచిందన్నారు. అందుకే ఆయన ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. జగన్ పై దాడిని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ది కోసమే బీజేపీ, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని రాజేంద్రప్రసాద్ దుయ్యబట్టారు.