మైత్రిని చెడగొట్టే కుట్ర: కన్నాపై సతీష్, కిందిస్థాయి బిజెపి నేతల్ని పట్టించుకోం: చినరాజప్ప
అమరావతి: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మధ్యన ఉన్న మైత్రిని చెడగొట్టేందుకు మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీ నారాయణ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సతీష్ బుధవారం నాడు ఆరోపించారు.
పది నెలలు కూడా అధికారం లేకుండా ఉండలేని ఆయనకు తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. పదేళ్లుగా మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు కాపు సామాజిక వర్గం సమస్యలు ఎందుకు పట్టలేదని విమర్శించారు.
ఆ బీజేపీ నేతల వ్యాఖ్యల్ని పట్టించుకోం: చినరాజప్ప
టిడిపిపై కిందస్థాయి బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలకు తాము ప్రాధాన్యత ఇవ్వమని, అసలు పట్టించుకోమని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలను సరఫరా చేసి, రానున్న రోజుల్లో రూ.90కే కిలో కందిపప్పు అందేలా చూస్తామన్నారు.
బీసీలకు ఇబ్బందులు కలగని రీతిలో కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ప్రకటించిన 196 మండలాలకు మరికొన్ని కరవు మండలాలు కలుపుతామన్నారు. కరవు మండలాలనుఆదుకోవడానికి రూ.1400 కోట్ల నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో మట్టి సత్యాగ్రహం: రఘువీరా
ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు తదితరులు నివాళులర్పించారు. మట్టి సత్యాగ్రహానికి ఆశీస్సులివ్వాలంటూ రాజ్ ఘాట్లో కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడారు.
ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో మట్టి సత్యాగ్రహం చేపట్టినట్లు వివరించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను సాధించేందుకు మట్టి సత్యాగ్రహం చేయనున్నట్లు వెల్లడించారు. ఈనెల 6న విస్తృతస్థాయిలో సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు.