నరేంద్ర మోడీ కాళ్లు జగన్ పట్టుకున్నారా? ఇదేనా కడప పౌరుషం'
కేసుల నుంచి తప్పించుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నారని,
అమరావతి: కేసుల నుంచి తప్పించుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నారని, అది నిజం కాదా చెప్పాలని టిడిపి ఎమ్మెల్సీ దొరబాబు, మరో నేత శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు.
ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం వైసిపి ప్రత్యేక హోదా పేరుతో దొంగనాటకం ఆడుతోందని, కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు పోరాటాలు చేస్తోందే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం కాదని ధ్వజమెత్తారు.
హోదా కాలం చెల్లిన కథ
సమస్యలు లేని రాష్ట్రంగా, ఆదర్శ ఏపీగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతుంటే దానిని వెనక్కు లాగటానికి ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు మండిపడ్డారు. 2019 ఎన్నికల కోసం ప్రత్యేక హోదాను తెరపైకి తీసుకొస్తున్నారని అది కాలం చెల్లిన కథ అన్నారు.
జగన్ నోరు మెదపలేదే..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రత్యేక హోదాకు ఎందుకు చట్టబద్దత కల్పించలేదని వారు ప్రశ్నించారు. అప్పట్లో ఎంపీగా ఉన్న వైయస్ జగన్ ఎందుకు నోరుమెదపలేదో ప్రజలకు చెప్పాలన్నారు. దేశంలో ఓడిపోయిన నాయకులతో రాహుల్ గాంధీ గుంటూరుకు వచ్చారని ఎద్దేవా చేశారు.
హోదా పేరుతో కాంగ్రెస్కు దగ్గరవుతున్న వైసిపి
ప్రత్యేక హోదా పేరుతో కాంగ్రెస్ పార్టీకి వైసిపి అంతర్గతంగా దగ్గరవుతోందని వారు ఆరోపించారు. మతతత్వ బిజెపితో టిడిపి కలిసిపోయిందని చెప్పిన జగన్ తన కేసుల కోసం మోడీ కాళ్లు పట్టుకున్నది నిజం కాదా అన్నారు.
ఇదేనా కడప పౌరుషం
చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో హోదా రాకపోయిన ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడి సుమారు రూ.2.40 లక్షల కోట్లు నిధులు రాబడుతున్నారన్నారు. హోదా కోసం ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు మాటమార్చుతున్నాడని, ఇదేనా కడప పౌరుషమని ప్రశ్నించారు.
ఇద్దరు బంగాళాఖాతంలో కలుస్తారు
రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా 14 కేంద్ర సంస్థల్లో ఇప్పటికే 12 సంస్థలు వచ్చాయని వారు గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో కూడా టిడిపియే అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత కాంగ్రెస్, జగన్ ఇద్దరూ బంగాళాఖాతంలో కలవక తప్పదన్నారు. రాష్ట్రానికి పెద్దదిక్కు చంద్రబాబేనన్న విషయాన్ని గుర్తించాన్నారు.