కుల వివక్ష వ్యాఖ్యలు ...వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి మద్దతు తెలిపిన టీడీపీ ఎమ్మెల్సీ
వైసీపీ దళిత మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి పై కుల వివక్ష వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నేతలకు టీడీపీని టార్గెట్ చేసే అస్త్రంగా మారాయి. టీడీపీ నాయకులు తుళ్ళూరు మండలం అనాతవరం గ్రామంలో వినాయక మండపం వద్ద పూజ చెయ్యటానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవిని అడ్డుకుని ఆమె పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల దూషణలతో ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. ఇక ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి తన మద్దతు ప్రకటించారు.
ఎమ్మెల్యే శ్రీదేవిపై కుల వివక్ష .. నలుగురు టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు..చంద్రబాబుపై ఎమ్మెల్యే ఫైర్
టీడీపీపై నిప్పులు చెరిగిన శ్రీదేవి .. చంద్రబాబుపై విమర్శలు
ఇక ఈ ఘటనపై ఎమ్మెల్యే శ్రీదేవి దళితులను టీడీపీ చులకన చూస్తోందని , టీడీపీ నాయకులతో పాటు చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ ను ప్రభుత్వ కార్యక్రమాల్లో తన పక్కన ఎన్నిసార్లు కూర్చోపెట్టుకొన్నారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుపై కూడా కేసు పెట్టాలని ఆమె మండిపడ్డారు. ఈ కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ డీజీపీ, ఎస్పీని కలిసినట్టుగా శ్రీదేవి తెలిపారు. ఈ ఘటన నేపధ్యంలో ఆమె టీడీపీపై నిప్పులు చెరిగారు. టీడీపీ ఎప్పుడూ దళితులను చిన్నచూపు చూస్తుందని ఆమె ఆరోపించారు. అందుకే చాలా మంది దళితులు వైసీపీలో చేరినట్టు పేర్కొన్నారు.
అధినేతపై విమర్శలు చేసినా వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు తెలిపిన టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్
తెలుగు దేశం పార్టీ అధినేతపై శ్రీదేవి విమర్శలు గుప్పించినా ,ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద రావు వైసిపి తాడికొండ ఎమ్మెల్యే వి శ్రీదేవికి మద్దతు తెలిపారు. ఒక ఎమ్మెల్యేపై దాడి చేయడం సముచితం కాదని, వారు ఏ పార్టీకి చెందినవారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇక ఆమెనూ అవమానించింది టీడీపీకి చెందిన వారని తెలిసినా ఆయన ఈ వ్యాఖ్యలు చెయ్యటం ఆసక్తికరంగా మారింది. ఘటనలో పాల్గొన్న బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్ . భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యేకే గౌరవం లేకుంటే ఎలా అని ప్రశ్నించిన డొక్కా మాణిక్య వరప్రసాద్
ఏదైనా సమస్యలుంటే చెప్పుకోవాలని కానీ దాడులు చేయడం కరెక్టు కాదన్నారు డొక్కా. ఇక రాజధానిలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఉంటారని ఎమ్మెల్యేకే గౌరవం లేకపోతే ఎలా? అని డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేను కులం పేరుతో అవమానించిన ఉదంతంలో టీడీపీ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ మద్దతు తెలపటం టీడీపీ వర్గాల్లో చర్చకు కారణం అవుతుంది.