మద్యం దొంగలు వైసీపీ నేతలే: కరోనా సంక్షోభాన్ని అవకాశంగా: లిక్కర్ రేట్ల పెంపుపై భగ్గుమన్న టీడీపీ
అమరావతి: రాష్ట్రంలో మద్యం రేట్లను 25 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ మండి పడుతోంది. మద్యం రేట్లను పెంచి ప్రజలను జేబులను గుల్ల చేస్తోందని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. జగన్ పాలనలో ఎలుకలు కూడా మందు తాగడానికి అలవాటు పడ్డాయని ఎద్దేవా చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటుసారాకు బ్రాండ్ అంబాసిడర్లు తయారయ్యారని విమర్శిస్తున్నారు.
వలస కార్మికులకు కాంగ్రెస్ వరం: పీసీసీ నేతలకు సోనియా లేఖ: అలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందని..
కరోనాను అడ్డు పెట్టుకుని
కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని, లాక్డౌన్ పరిస్థితులను అడ్డుగా పెట్టుకుని ప్రజలపై పన్నులు వేసిన సందర్భాలు ప్రపంచంలోనే ఎక్కడా లేవని శాసన మండలిలో ప్రధాన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. మద్యంపై పన్నులను పెంచడానికి ఇది సరైన సందర్భం కాదని ఆయన ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా పన్నులను పెంచుకుంటూ పోతే తాము చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. ధరలు పెంచడానికి సమయం, సందర్భం అంటూ ఉంటుందని హితవు పలికారు.
ప్రజారోగ్యంతో జగన్ చెలగాటం..
రాష్ట్రంలో ఒకవైపు కరోనాతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతుంటే.. వైసీపీ నాయకులు వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని యనమల ఆరోపించారు. ఈ విఫత్తు సమయంలో ప్రజలపై మద్యం రూపంలో భారం వేసిన అయిదు వేల కోట్ల రూపాయలను రాబట్టుకోవడానికి కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఏపీలో మద్యం కంపెనీల ఒత్తిళ్ల మేరకే ఇప్పుడీ ధరలను పెంచారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే మద్యం కంపెనీలకు భారీగా ఉత్పత్తులకు అనుమతిచ్చారని, రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించడానికి ఏర్పాట్లు చేశారని విమర్శించారు.
మద్యంపాన నిషేధం మాటున..
మద్యపాన్ని నిషేధిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన వైఎస్ఆర్సీపీ తన హామీలను తుంగలో తొక్కిందని యనమల ఆరోపించారు. మద్యం కంపెనీల నుంచి అందే కమీషన్ల కోసమే ప్రభుత్వం సరికొత్త కుట్రలకు తెర తీసిందని ధ్వజమెత్తారు. ఇప్పటికే రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందని.. వైసీపీ నాయకులు నాటుసారా తయారీ వెనుక ఉన్నారని, బ్రాండ్ అంబాసిడర్లుగా తయారయ్యారని విమర్శించారు. నాసిరకం మద్యాన్ని తయారు చేసి, వలంటీర్లతో అమ్మిస్తున్నారని ఆరోపించారు.
Recommended Video
మద్యం దొంగలుగా వైసీపీ నేతలు..
అధికార పార్టీ నాయకులు మద్యం దొంగలుగా మారిపోయారని యనమల అన్నారు. ఏపీలో మద్యం దుకాణాల నుండి మద్యం దొడ్డిదారిన తరలించి అక్రమ అమ్మకాలు జరిపారని విమర్శించారు. ఎలుకలు ఇనుము తిన్నాయని గతంలో కథల్లో విన్నామని.. ఇప్పుడు ఏకంగా మద్యం తాగాయని చెప్పడం దారుణమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఇచ్చింది సగం అయితే గుంజుకుంటోంది రెట్టింపని యనమల అన్నారు. గత ఏడాదిగా ఆర్టీసి ఛార్జీల పెంపు, కరెంట్ బిల్లుల పెంపు, ఇసుక ధర పెంపుతో ప్రజలపై భారం మోపిందని గుర్తు చేశారు.