తెలుగుదేశం: రాయపాటి చేరిక, మోదుగుల ఔట్
మనసావాచా తాను లోకసభ స్థానానికి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు మోదుగుల ఆదివారం చెప్పారు. దీన్నిబట్టి ఆయన టిడిపిని వీడడం ఖాయమని అనిపిస్తోంది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆళ్ల అయోధ్యా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి నర్సారావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో మోదుగులకు నర్సారావుపేట టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే, రాజకీయాలు వేరు, బంధుత్వం వేరని, తాను నర్సారావుపేట నుంచి పోటీ చేస్తానని మోదుగుల అంటున్నారు.
రాష్ట్ర విభజన బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా ఫిబ్రవరి 13న సభలో ఏం జరిగిందన్న దానిపై భిన్నవాదనలు ఉన్నాయి. లోక్సభ ప్రసారాలను నిలిపివేయడంతో సామాన్యులకు సభలో జరిగిన వాస్తవాలు తెలియలేదు. ఈ నేపథ్యంలో నాటి లోకసభ వీడియో క్లిప్పింగ్లను ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి ఆదివారం మీడియాకు విడుదల చేశారు.
నాటి పరిణామాల్లో కొంతమంది ఎంపీలు, కేంద్ర మంత్రులు, జాతీయ మీడియా తనను ఓ హంతకుడిగా చిత్రీకరించిందని, తాను కత్తి తీసుకొని వెళ్లానని ఆరోపించిందని, ఆ రోజున ఏం జరిగిందో కళ్లకు కట్టే లోక్సభ వీడియో క్లిప్పింగ్స్ను తెప్పించానని, వాటిని ప్రజల ముందుంచుతున్నానని, ప్రజలే స్పందించాలని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణ ప్రాంత ఎంపీలు మార్షల్స్లా స్పీకర్ పోడియం వద్ద అడ్డుగా నిలబడి తనపై మూకుమ్మడిగా దాడి చేశారన్నారు.