టార్గెట్ జగన్ : పవన్ వద్దకు రైతులను పంపింది చంద్రబాబేనా : రాజధాని కేంద్రంగా ఒక్కటయ్యేందుకే..!!
ఏపీలో రాజధాని రాజకీయాలు మొదలయ్యాయి. మంత్రి బొత్సా వ్యాఖ్యలతో రాజధాని తరలింపు పైన చర్చ మొదలైంది. దీని పైన టీడీపీ మాజీ మంత్రులు ఆమరణ దీక్ష హెచ్చరికలు చేసారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. అయితే, ప్రభుత్వం నుండి మాత్రం స్పష్టత రాలేదు. మంత్రి బొత్సా తన వ్యాఖ్యలనే పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరి కొందరు మంత్రులు రాజధాని అమరావతి తరిలింపు ఆలోచన లేదని చెబుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కొందరు రాజధాని ప్రాంత రైతులు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా..జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నేత సుజనా చౌదరిని కలిసారు.
అయితే, వీరు ఎవరి సూచనలతో వీరిని కలిసారు అనేది ఆసక్తి కర చర్చ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు వీరిని కలవాల్సిందిగా పార్టీ నేతల ద్వారా వారిని సూచన చేయించారని ప్రచారం జరుగుతోంది. దీని ద్వారా టీడీపీకి దూరమైన జనసేన..బీజేపీ తిరిగి రాజధాని వ్యవహారం కేంద్రంగా ఒక్కటై జగన్ ను లక్ష్యంగా చేసుకొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ యాత్రం..పవన్ ఈ నెల 30,31 తేదీల్లో అమరావతి పర్యటన తో రాజకీయం మరింత రంజుగా మారనుంది.
పవన్.. కన్నా..సుజనా వద్దకు రెతులు వెళ్లటం వెనుక..
అమరావతి రాజధానిగా ఖరారు చేసిన ఆ ప్రాంతంలోని కొందరు రైతులు నాటి నుండి నేటి వరకు ఏ సమస్య వచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లటం సాధారణంగా మారింది. తాజాగా మంత్రి బొత్సా వ్యాఖ్యలతో రాజధాని రైతుల్లో ఒక్క సారిగా ఆందోళన మొదలైంది. దీంతో..టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. మాజీ మంత్రి పుల్లారావు రాజధాని తరలిస్తే తాను ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఇదే సమయంలో రైతులు దీని పైన టీడీపీ నేతలను కలిసారు. పార్టీ అధినేత చంద్రబాబు సూచనలతో కొందరు రైతులకు సూచనలు అందాయి. ఈ సమయంలో టీడీపీ ఒక్కటే కాదని..జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ..సుజనా చౌదరితో సమావేశం కావాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..వారు తొలుత కన్నా తో సమావేశమయ్యారు. ఆయన అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే హైదరాబా్ కు వెళ్లి జనసేన అధినేత పవన్ తో సమావేశమయ్యారు. ఆ వెంటనే రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తో కలిసి రాజధాని తరలించకుండా చూడాలని రైతులు కోరారు. వారి అభ్యర్ధను సుజనా చౌదరి సైతం మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా అధికార పార్టీకి వ్యతిరేకంగా తిరిగి 2014లో కలిసి పోటీ చేసిన పార్టీలు ఒక్కటయ్యేందుకు పావులు కదుపుతున్నారు.
పవన్..బీజేపీతో కలిసి పోరాటం దిశగా..
తమ వద్దకు వచ్చిన నేతలను బీజేపీ..జనసేన నేతలకు వద్దకు పంపటం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. రాజధాని మీద గతంలో ఎన్నడూ గట్టిగా మాట్లాడని బీజేపీ నేతలు సైతం ఇప్పుడు తమ వాదన బలంగా వినిపిస్తూ..ముఖ్యమంత్రి జగన్ పైన మండిపడుతున్నారు. అదే సమయంలో గతంలో పవన్ కళ్యాణ్ రాజధాని సమయంలో పర్యటించిన సందర్భంలో అక్కడి రైతులు పవన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. పవన్ సైతం రైతుల వద్ద నుండి వారికి ఇష్టమైతేనూ భూములు తీసుకోండి..బలవంతంగా తీసుకుంటే వారి కోసం పోరాటం చేస్తానని హెచ్చరించారు. కానీ, తరువాత రాజధాని వ్యవహారాల మీద అంతగా శ్రద్ద పెట్టలేదు. అదే సమయంలో రాజధాని కోసం ఇంత భూమి అవసరమా అని పవన్ ప్రశ్నించారు. ఇక, ఇప్పుడు రాజధాని తరలింపు వ్యవహారం పైన రైతులు కలవగా..రాజధాని తరలింపు అంత సులువు కాదని..రైతులకు మద్దతుగా తాను ఈ నెల 30, 31 తేదీల్లో రాజధానిలో పర్యటిస్తానని పవన్ ప్రకటించారు. పవన్ రాజధానిలో పర్యటించటం ద్వారా సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఫోకస్ అటు ఉండే అవకాశం ఉంది. ఇక, సుజనా చౌదరి సైతం రైతులకు అండగా ఉంటామని..బీజేపీ రైతులకు మద్దతుగా ఉంటుందని స్పష్టం చేసారు. దీని ద్వారా టీడీపీ తమ వ్యూహం ప్రకారం పవన్ ను రంగంలోకి తీసుకురావటంలో సక్సెస్ అయింది. రాజధాని లో పవన్ పర్యటన సమయంలో ముఖ్యమంత్రి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు.. ఈ లోగా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత వస్తుంది అనే దాని పైన ఆధార పడి ఉంటుంది.
ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా..అడుగులు..
ముఖ్యమంత్రి జగన్ పైన మూకుమ్మడి దాడి తో రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేయాలనదే టీడీపీ అధినేత ఆలోచనగా కనిపిస్తోంది. ఇక, సున్నిత మైన రాజధాని వ్యవహారంలో టీడీపీ వ్యవహార శైలి కారణంగా ఇతర ప్రాంతాల్లో రాజకీయంగా ఎక్కడా డామేజ్ కాకుండా.. ఇప్పుడు రాజధాని ప్రాంతంలోనే వైసీపీకి నష్టం చేసేలా అడుగులు వేస్తోంది. ఇక, ఇదే సమయంలో బీజేపీ..జనసేనతో కలిసి అవసరం అయితే రాజధాని కోసం కలిసి పోరాటాలు చేయాలనేది టీడీపీ అంతర్గత ఆలోచన. పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలోగా ప్రభుత్వం రాజధాని వ్యవహారం పైన స్పష్టత ఇవ్వకపోతే..పవన్ పర్యటన వేదికగా ఆయన చేసే ప్రకటనతో తాము భాగస్వాములు కావాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు కలిసి కట్టుగా ఉంటే జగన్ ను దెబ్బ తీయవచ్చని టీడీపీ అంచనా. దీనికి అనుగుణంగానే తమ మాజీ మిత్రులను దగ్గర చేసుకోవటానికి రాజధాని వ్యవహారాన్ని ఉపయోగించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. రాజధాని ప్రాంత రైతులు అసలు తమ సయస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవాలి..కానీ, వారు సీఎం ను కాకుండా ఇతర పార్టీల నేతలను కలవటం ద్వారానే..ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా కొత్త మలుపులు తీసుకుంటోంది.