ఏ సీఎం ఇలా అడగలేదు, మేం తెలంగాణవారిలా కాదు: అవంతి సంచలనం, నేనే తిరగబడితే: బాబు కౌంటర్
అమరావతి: తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్లో ఆ పార్టీ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆవేశంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం సాయం కోసం అర్థిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబులో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో కేంద్రాన్ని అభ్యర్థించలేదని చెప్పారు.
విభజన చట్టం హామీల అమలు విషయమై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉండవల్లిలో రెండో రోజు జరిగిన టీడీపీ వర్క్ షాప్లో విభజన చట్టం హామీల అమలు విషయమై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడారు.
విభజనలో కాంగ్రెస్ది ఎంత బాధ్యతో, బీజేపీదీ అంతే
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత బాధ్యత ఉందో బీజేపీకి కూడా అంతే బాధ్యత ఉందని అవంతి శ్రీనివాస్ అన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, ఏ సీఎం కూడా ఈ స్థాయిలో కేంద్రాన్ని అభ్యర్థించడం లేదని అన్నారు. రైతులు భూములు ఇచ్చారు కాబట్టి పరిపాలన చేయగలుగుతున్నామని చెప్పారు.
చంద్రబాబు ఎదుటే ఆవేశం
రూ.11,600 కోట్ల విలువైన భూములను కేంద్ర విద్యా సంస్థకు ఇస్తే, పరిహారం కింద కేవలం కేంద్రం రూ.150 కోట్లు ఇస్తుందా? అని అవంతి ప్రశ్నించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.30 వేల కోట్లు ఖర్చవుతుంటే కేవలం రూ.3 వేల కోట్లు ఇస్తారా అన్నారు. చంద్రబాబు ఎదుటే ఆయన ఆవేశంగా మాట్లాడారు.
చంద్రబాబు గురించి కేంద్రం గుర్తు పెట్టుకోవాలి
చంద్రబాబు 5 కోట్ల మందికి ప్రతినిధి అని కేంద్రం గుర్తు పెట్టుకోవాలని అవంతి చెప్పారు. చంద్రబాబు ఢిల్లీకి 42సార్లు వెళ్లి వచ్చారని, విభజన చట్టంలోని హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్ అమలుకాలేదన్నారు.
ఏపీ ప్రజలు తెలంగాణ ప్రజల్లా కాదు
మీకు (చంద్రబాబు)కు సముద్రమంత సహనం ఉందని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, వారికి అంత సహనం లేదని అవంతి అన్నారు. అవసరమైనప్పుడు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏపీ ప్రజలు ప్రతి దానికి తెలంగాణ ప్రజల్లా ఆందోళన చేయరని, సమయం చూసి ఏపీ ప్రజలు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా హామీలు అమలుకు నోచుకోవాలన్నారు.
నేనూ తిరగబడితే, రెచ్చిపోతారు, లేదంటే కేంద్రానికి దండం
ఇదిలా ఉండగా, అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. తాను చివరిదాకా ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. మిగతా వారిలా తాను కూడా తిరగబడితే ప్రజలు అసహనానికి గురై రెచ్చిపోతారన్నారు. చివరి వరకు వేచిచూద్దామని, కాకపోతే కేంద్రానికి దండం పెడతామన్నారు.
ప్రతిపక్షాలు రాజీపడుతున్నాయి
కేంద్రంతో గొడవలు పెట్టుకుంటే పనులు జరగవని అవంతికి హితబోధ చేశారు. విభజన సమస్యలపై రాజీపడే ప్రసక్తి లేదన్నారు. కేంద్రంతో గొడవ లేకుండా నిధులు సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తమ అవసరాల కోసం కేంద్రంతో ప్రతిపక్షాలు రాజీపడుతున్నాయని వైసీపీని ఉద్దేశించి అన్నారు.