రైల్వేజోన్ కోసం ఎంపీ ఆవంతి శ్రీనివాస్ నిరహరదీక్ష
విశాఖపట్టణం: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వాలనే డిమాండ్తో టిడిపి ఎంపీ ఆవంతి శ్రీనివాస్ ఆదివారం నాడు నిరహరదీక్ష చేపట్టారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్దమేనని ఆయన ప్రకటించారు.
విభజన హమీ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన చెప్పారు. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను కేంద్రం విస్మరించిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇటీవల కాలంలో అనేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.అయినా ప్రధానమంత్రి మోడీ నిర్లక్ష్యాన్ని వీడడం లేదన్నారు.
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు విషయమై రాజకీయ నిర్ణయం తీసుకొంటే సరిపోతోందన్నారు. కానీ, కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే ఈ విషయమై తాత్సారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని ఆయన చెప్పారు.రైల్వేజోన్ ను సాధించేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.ఈ దీక్షలో టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.