ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి, పవన్ విమర్శలపై అవంతి విసుర్లు
అమరావతి: ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వలేకపోయామో బిజెపి స్పష్టంగా చెప్పలేదని టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుండి తాము బయటకు రావాల్సి వచ్చిందని అవంతి శ్రీనివాస్ గుర్తు చేశారు.
సోమవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలు తమకు అవసరం లేదని అవంతి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు.
రాష్ట్రం కోసం ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ అడిగితే మోడీ సమయం ఇవ్వకుండా వైసీపీకి చెందిన ఎంపీలకు సమయం కేటాయించడం తప్పుడు సంకేతాలను ఇస్తోందని అవంతి శ్రీనివాస్ గుర్తు చేశారు.
ప్రత్యేక హోదాను ఇస్తామని ఎన్నికల ప్రచారంలో బిజెపి చేసిన ప్రచారాన్ని శ్రీనివాస్ ప్రస్తావించారు. రాజ్యసభలో ఆ పార్టీ చేసిన డిమాండ్ను ప్రస్తావించారు. మరో వైపు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పారు. అయితే ప్రత్యేక హోదాతో కూడిన ప్రయోజనాలతోనే ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని చెప్పి దాన్ని కూడ అమలు చేయలేదని ఆయన చెప్పారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీపై పోరాటం చేయాలని టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ సూచించారు.కానీ, టిడిపిపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం సరికాదని అవంతి శ్రీనివాస్ చెప్పారు.