మోడీని కిమ్ జాంగ్తో పోల్చిన మంత్రి, 'పవన్ కళ్యాణ్ దారుణంగా మాట్లాడుతున్నారు'
Recommended Video
కడప: రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్ష మంగళవారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ మంగళవారం మాట్లాడుతూ.. కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. దీక్ష చేస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బీజేపీ వైఖరికి నిదర్శనమన్నారు. బీజేపీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీయవద్దని చెప్పారు. హామీల అమలు కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు ఢిల్లీలో యాత్రలు చేయాలన్నారు.
చదవండి: అదే జరిగితే జనసేన కథ ముగిసినట్లే: పవన్కు హెచ్చరిక, తెరవెనుక ఏం జరుగుతోంది?
కాగా, సోమవారం సీఎం రమేష్ దీక్షకు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. ఏపీ అభివృద్ధికి దుష్టచతుష్టయం అడ్డుపడుతోందని, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, వైసీపీ.. ఒకేగూటి పక్షులుగా మారి అర్థంలేని విమర్శలతో పబ్బం గడుపుకుంటున్నారని, మానవత్వం లేని ప్రతిపక్షం, కేంద్రం.. టీడీపీ దీక్షలపై అవహేళనగా మాట్లాడుతున్నాయని మంత్రులు ధ్వజమెత్తారు. ఎవరు అడ్డుపడినా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుదామన్నారు.
మోడీని కిమ్ జాంగ్ ఉన్తో పోల్చిన మంత్రి
సీఎం రమేష్ ప్రాణాలకు తెగించి ఆమరణదీక్షకు దిగడం గర్వంగా ఉందని నేతలు అన్నారు. వారి దీక్షకు మంత్రులు జవహర్, ఆదినారాయణ రెడ్డి, ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు తదితరులు మద్దతిచ్చారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడారు. ప్రధాని మోడీ కుటుంబం లేని వ్యక్తి అని, అందుకే బంధాలు, బంధుత్వాలు తెలియడం లేదని జవహర్ మండిపడ్డారు. కిమ్తో సరితూగే వ్యక్తి మోడీ అని, ఉత్తర కొరియాలో ఆయనకు యుద్ధకాంక్ష ఉంటే భారత ప్రధానికి రాజ్యకాంక్ష ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ మాస్టర్
జగన్ ముద్దులయాత్ర చేస్తున్నారని జవహర్ మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ మాస్టర్గా పేరొందితే, జగన్ కరప్షన్ మాస్టర్గా గుర్తింపు పొందారన్నారు. విభజన బిల్లు తప్పులతడకగా ఉందంటున్న బీజేపీ.. అప్పుడు ఎందుకు ఒప్పుకున్నారో చెప్పాలని కంభంపాటి రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలకు రాజకీయం కావాలో? రాష్ట్రాభివృద్ధి కావాలో తేల్చి చెప్పాలన్నారు.
పవన్ కళ్యాణ్ దారుణంగా మాట్లాడుతున్నారు
ప్రతిపక్షాలు సీఎం రమేష్ దీక్షను అవహేళన చేయడం సరికాదని కుటుంబరావు అన్నరాు. కర్ణాటక ఎన్నికల ఒప్పందాల్లో భాగంగా గాలి జనార్దన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసమే కడప ఉక్కుపై కేంద్రం రాజకీయం చేస్తోందన్నారు. జగన్, గాలి జనార్దన్ రెడ్డికి కడపకు ఉక్కు పరిశ్రమ రావడం ఇష్టం లేదన్నారు. అందుకే గాలితో ప్రకటన ఇప్పిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఓ పారిశ్రామికవేత్త ముందుకొస్తే డబ్పులు అడిగారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారని, లోకేష్పై విమర్శల నుంచి విశాఖ భూముల వరకు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడటం దారుణం అన్నారు. పవన్ ఆధారాలు, పేర్లతో సహా చెప్పాలని డిమాండ్ చేశారు.
మాకు ఉక్కు పరిశ్రమ కావాలి
మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. కడపలో దీక్ష ఆరంభమయ్యాక బీజేపీ వర్గాలు గాలి జనార్దన్ రెడ్డితో మాట్లాడిస్తున్నారని, కేంద్రం అన్ని అనుమతులు ఇస్తే సహకరిస్తామని, బ్రహ్మిణిని పూర్తి చేసినా అభ్యంతరం లేదని చెప్పారు. కడపకు ఉక్కు పరిశ్రమ వస్తే చాలన్నారు. మరోవైపు సీఎం రమేష్ దీక్షను కొనసాగించేందుకే సిద్ధంగా ఉన్నారు.