ఐటీ శాఖ అనుమానం: రూ.74 కోట్లు స్కామ్కు సీఎం రమేష్ పాల్పడ్డారు..?
ఎనిమిది రోజుల విచారణ అనంతరం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ రూ.74 కోట్లు మేర జరిపిన లావాదేవీలు సందేహాస్పదంగా ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఈ మెత్తం లావాదేవీలు సీఎం రమేష్ నాయుడు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జరిపిందని ఐటీ శాఖ వివరించింది. అంతేకాదు సబ్కాంట్రాక్టర్లతో రూ.100 కోట్లు మేరా లావాదేవీలు జరిపిందని అవికూడా లెక్కలు సరిగ్గా లేవని తెలిపింది.
ఇప్పటి వరకు సీఎం రమేష్కు సంబంధించి రూ.13 లక్షలు నగదు, 3000 డాలర్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మొత్తం రూ.74 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఎలాంటి రుజువులు లేవని... రూ.25 కోట్లకు సమర్పించిన బిల్లులు అనుమానాస్పదంగా ఉన్నాయని ఐటీ అధికారులు వెల్లడించారు. సబ్ కాంట్రాక్టర్గా ఈడీసీఓ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు రూ.12 కోట్లు గత ఆరేళ్లుగా రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించిందని ఐటీ తెలిపింది.అయితే ఈడీసీఓ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది పేర్కొన్న అడ్రస్లో మాత్రం ఎక్కడా లేదని ఐటీ శాఖ తెలిపింది. ఇక ఈడీసీఓ అధికారి సాయిబాబా రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అకౌంటెంట్గా వ్యవహరిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని ఐటీ అధికారులు వెల్లడించారు.
రూ.33 కోట్లకు సంబంధించిన బిల్లుపై ఐటీ అధికారులు సీఎం రమేష్ను కానీ సాయిబాబాను కానీ ప్రశ్నించినప్పుడు వారు నీళ్లు నమిలారని దానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియజేయలేక పోయారని ఐటీ శాఖ తెలిపింది. మరోవైపు రూ.23 కోట్లుకు లెక్కలు లేవని పేర్కొంది. రూ.12.24 కోట్లు స్టీల్ సప్లయర్ నుంచి రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుందని దానికి సంబంధించిన లావాదేవీలను మాత్రం వివరించడంలో సీఎం రమేష్ విఫలమయ్యారని పేర్కొంది. అంతే కాదు 2శాతం కమిషన్తో రూ.7.98 కోట్లు స్టీల్ సప్లయర్ నుంచి తీసుకున్నట్లుగా మెయిల్ వచ్చిందని దానిపై కూడా స్పష్టత ఇవ్వలేదని ఐటీ వెల్లడించింది. మరోవైపు ఢిల్లీ సబ్ కాంట్రాక్టర్ ఎన్కేజీ కన్స్ట్రక్షన్ కంపెనీకి రూ.6 కోట్లు చెల్లింపులు జరిగాయని ఐటీ గుర్తించింది. అయితే దానికి సంబంధించిన బిల్లులు మాత్రం లేవని ఐటీ వివరించింది.