17న మోడీని కలుస్తాం, కాదంటే: సీఎం రమేష్ తీవ్ర నిర్ణయం! మీడియాకు వివరాలిచ్చిన ఎంపీలు
Recommended Video
అమరావతి: కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలం ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని, ఆ తర్వాత 24వ తేదీ నుంచి తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ శుక్రవారం చెప్పారు.
తాము కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. ప్రధాని మోడీని కలిసి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. ఆయన స్పందించకుంటే మాత్రం ఆమరణ దీక్షకు దిగుతానని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం పాత నివేదికతో సుప్రీం కోర్టు అఫిడవిట్ ఇచ్చిందని ఆరోపించారు.
మీడియాకు వివరాలు ఇచ్చిన టీడీపీ
అంతకుముందు, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో బీజేపీ, వైసీపీ ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించిన వివరాలు అంటూ కొన్ని విషయాలను మీడియాకు విడుదల చేశారు. అయితే, ఆకుల సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు అదే విషయం చెప్పారు. తాము స్నేహితులమని, కలుసుకున్నామని చెప్పారు. వారిద్దరు కలిసి ప్రభుత్వ వాహనంలో బీజేపీ నేత రామ్ మాధవ్ ఇంటికి వెళ్లారని టీడీపీ ఎంపీలు చెప్పగా, వీరు కొట్టి పారేస్తున్నారు.
మరిన్ని వివరాలు ఇచ్చేందుకు సిద్ధం
ఇందుకు సంబంధించి టీడీపీ ఎంపీలు కారు లాగ్ బుక్ వివరాలు, వీడియో ఫుటేజీని విడుదల చేశారు. మరిన్ని వివరాలు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమని టీడీపీ ఎంపీలు ప్రకటించారు. రాజీనామా పేరుతో వైసీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. ఢిల్లీలో జరగనున్న నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు విభజన హామీలను ప్రస్తావిస్తారని తెలిపారు. పార్లమెంటు లోపలే కాకుండా బయట కూడా ఉద్యమిస్తామన్నారు.
జిల్లాల్లో వరుసగా నిరసనలు
పార్లమెంట్ సమావేశాలకు ముందుగా ఏపీ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని సీఎం రమేష్ చెప్పారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఈ నెల 20న కడపలో, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు ఈ నెల 27న ఆందోళన చేపడతామని ఎంపీలు తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు జరిగిన అన్యాయంపై జులై 4న అనంతపురంలో నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని పేర్కొంటూ సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేసినా వైసీపీలోఎలాంటి స్పందనా లేదన్నారు.
20న కడపకు వెళ్తాం
కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ఈ నెల 20న కడపకు వెళ్తామన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసేలా ప్రవర్తిస్తోన్న కేంద్రంపై అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.