మీసం తిప్పా, 3బెడ్రూం ఇంట్లో అర్ధరాత్రి దాకానా: ఐటీ సోదాలపై ఛానల్స్కు సీఎం రమేష్ హెచ్చరిక
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ సాక్షి పత్రిక, ఛానల్ పైన ఆదివారం మండిపడ్డారు. ఇరవై ఏళ్ల క్రితం ప్రారంభమైన తన కంపెనీకి ఏపీ ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో రూ.2వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిందని చెప్పారని, కానీ తాను తప్పు చేసినట్లు తేలితే మీడియా ముందు ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.
నాలుగున్నర సంవత్సరాల కాలంలో రూ.2వేల కోట్ల వర్క్స్ చేయకూడదా అని తనను టార్గెట్ చేసిన మీడియాను ఆయన ప్రశ్నించారు. నేను ఏమైనా నేరం చేశానా అని ప్రశ్నించారు. కంపెనీ ఎక్కడైనా నేరం చేస్తే చెప్పాలన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచి రిత్విక్ కంపెనీ ఉందన్నారు. వైసీపీలో ఉన్నవారైతే చేసుకోవచ్చు, ఇతరులు చేసుకోవద్దా అని వైసీపీ, సాక్షిని ప్రశ్నించారు.
Recommended Video
నా భార్య పేరుతో తప్పుడు వారెంట్, అలా చెప్పమన్నారు: ఐటీ ఆఫీసర్లపై సీఎం రమేష్ సంచలనం
రాయలసీమ పౌరుషం చూపిస్తూ, మీసం తిప్పి
తనపై ఐటీ దాడులు జరిగితే ధైర్యంగా, మగాడిలా, రాయలసీమ పౌరుషం చూపిస్తూ, మీసం తిప్పి మీడియా ముందుకు వచ్చి రండి తేల్చుకుందామని చెబుతున్నానని, మీరు నిరూపించకుంటే మీరేం చేస్తారు, నేను తప్పు చేసినట్లు తేలితే నన్ను ఉరితీసినా అభ్యంతరం లేదని సీఎం రమేష్ ధ్వజమెత్తారు. తాను దేనికైనా సిద్ధం రావాలని చెప్పానని అన్నారు. కొంతమంది ఛానల్స్లోను మాట్లాడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ ఆదాయపన్ను శాఖ గొడవలు ఏమిటని సీఎం రమేష్ ప్రశ్నించారు.
ఏ ఛానల్ అని అడిగిన సీఎం రమేష్
ఆ తర్వాత ఓ టీవీ ఛానల్ జర్నలిస్ట్ ప్రశ్న అడిగారు. దానికి సీఎం రమేష్ స్పందిస్తూ.. మీరు ఎవరు, ఏ ఛానల్ నుంచి వచ్చారని అడగ్గా, సదరు జర్నలిస్ట్ స్పందించారు. తాను ఓ ఛానల్ నుంచి వచ్చానో చెప్పారు. సీఎం రమేష్ స్పందిస్తూ.. మీరు బీజేపీకి చెందిన వారని, అది కాదా చెప్పాలని నిలదీశారు.
మూడు బెడ్రూంలు ఉన్న ఇంట్లో అర్ధరాత్రి దాకా సోదాలు
మూడు బెడ్రూంలు ఉన్న ఇంట్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సోదాలు చేయడానికి ఏమి ఉంటుందని సీఎం రమేష్ ప్రశ్నించారు. 12 మంది అధికారులు సోదాలు చేయడం వేధింపులు కాకుండా మరేమిటని నిలదీశారు. మా కుటుంబ సభ్యుల ఫోన్లు లాక్కొని డబ్బాలో పడవేశారని ఆరోపించారు. ఫోన్లు మాట్లాడితే ఏమవుతుందని, వారేమైనా నేరస్థులా అని ప్రశ్నించారు. రిత్విక్ కంపెనీకి సంబంధం లేని తన భార్య పేరుతో సెర్చ్ వారెంట్ ఉందన్నారు. తన భార్య పేరిట ఎలాంటి కంపెనీలు లేకున్నప్పటికీ ఆమెపై సెర్చ్ వారెంట్ తీసుకు రావడంపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు.
హడావుడిగా సోదాలు చేయాలని ప్రయత్నం
దేశంలోనే తొలిసారిగా మీడియా పైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం రమేష్ ధ్వజమెత్తారు. వార్తలు ఉన్నది ఉన్నట్లు రాస్తే కక్ష కడతారా అని నిలదీశారు. గతంలో పలుమార్లు ఐటీ దాడులు జరిగినా తాను మీడియా ముందుకు రాలేదని చెప్పారు. ఈసారి కక్ష సాధింపుతో చేసినందు వల్ల వచ్చానని అన్నారు. దాదాపు 25 చోట్ల ఐటీ సోదాలు జరిగాయని చెప్పారు. సమాచారం లేకుండానే హడావుడిగా సోదాలు చేయాలని చూశారన్నారు.
పార్టీ మారాలని తనకు ఐటీ అధికారి చెప్పడం దేనికి నిదర్శనం
తనను పార్టీ మారాలని ఆదాయపన్ను శాఖ అధికారి మదన్ అనడం దేనికి నిదర్శనం అని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఐటీ సోదాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. రిత్విక్ కంపెనీ అకౌంట్లో రూ.73వేలే ఉన్నాయని చెప్పారు. తమ ఇంట్లో ఉన్న వారి బ్యాంకు అకౌంట్లు, పాస్బుక్కులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ఎండగడతానని, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకు వస్తానన్నారు.
51 గంటల పాటు సోదాలు
ఇదిలా ఉండగా రిత్విక్ కంపెనీ నుంచి ఐటీ ఆధికారులు పలు ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. 51 గంటలు సోదాలు జరిపారు. సాగర్ సొసైటీలోని రిత్విక్ ప్రాజెక్టులో విస్తృత తనిఖీలు చేశారు. కొంత నగదు, పలు ఫైళ్లు, హార్డ్ డిస్క్లు తీసుకెళ్లారని తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు జూబ్లీహిల్స్లోని రమేష్ నివాసంలో సోదాలు ముగిసాయి.