సరిగ్గా అదే సమయంలో సిఎం రమేష్ కు ఐటి అధికారుల ఫోన్...స్పాంటేనియస్ గా స్పందించిన టిడిపి ఎంపి
న్యూఢిల్లీ:తెలుగు రాష్ట్రాల్లో తన నివాసాలు,కార్యాలయాలపై జరుగుతున్న ఐటి దాడులపై టిడిపి ఎంపి సిఎం రమేష్ స్పందన ఆయన రాజకీయ పరిణతికి అద్దం పట్టింది.
కేవలం రాజకీయ కక్ష్యతోనే తమ పార్టీ నేతలపై ఈ దాడులు జరుగుతున్నాయనే వాదనకు బలం చేకూర్చేందుకు తనకు అనుకోకుండా లభించిన ఒక అవకాశాన్ని సిఎం రమేష్ చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. తాను ఏ విషయాన్నైతే మీడియాకు చెప్పేందుకు వచ్చారో...అదే మ్యాటర్ ను ప్రాక్టికల్ గా మీడియాకు కళ్లకు కట్టేట్లు వివరించేందుకు అనూహ్యంగా లభించిన ఒక ఛాన్స్ ను సిఎం రమేష్ పక్కాగా వినియోగించుకున్నారు...అదేమిటంటే?...
ఆయన ఢిల్లీకి...వీళ్లు ఇళ్ల పైకి
కడపలో స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలంటూ టిడిపి ఎంపి సిఎం రమేష్ దీక్ష చేసి సరిగ్గా 100 రోజులు పూర్తయింది. దీంతో దీక్ష విరమించే సందర్భంగా తాను పెట్టిన వంద రోజుల గడువు గురించి కేంద్రాన్ని నిలదీసేందుకు సిఎం రమేష్ ఢిల్లీ వెళ్లారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఐటి దాడులు జరపడానికి గల కారణఆలు ఏంటో చెప్పాలని పిఎసి సభ్యుడిగా సిఎం రమేష్ ఐటి శాఖను వివరణ అడిగి మూడు రోజులయింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సిఎం రమేష్ నివాసాలు, కార్యాలయాల్లో ఐటి దాడులు, సోదాలు మొదలయ్యాయి.
సిఎం రమేష్ స్పందన...ప్రెస్ మీట్
దీంతో ఈ విషయమై ఢిల్లీలో టిడిపి ఎంపి సిఎం రమేష్ స్పందించారు. కేంద్రం కక్షపూరితంగా తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతుందని టిడిపి ఏదైతో వాదిస్తుందో ఆ వాదన నిజమనేలా ఐటి దాడులు ఉన్నాయని...తాను ఢిల్లీకి వచ్చానని తెలిసే ఈ దాడులు జరిపారని సిఎం రమేష్ ఈ ఐటి దాడులపై మీడియాకు తన స్పందన తెలియజేశారు. రాజకీయ కక్షతో, భయానక వాతావరణం సృష్టించేందుకే...కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఐటి దాడులు జరుగుతున్నాయని సిఎం రమేష్ మీడియాకు వివరిస్తున్నారు. అయితే ఈ దాడులకు ఏమాత్రం భయపడేది లేదని, కేంద్రంపై తమ పోరాటం యథావిధిగా కొనసాగుతుందని తేల్చిచెబుతున్నారు.
ఐటి అధికారుల కాల్...స్పాంటేనియస్ గా
అంతలోనే...ఎంపి సిఎం రమేష్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ ఐటి అధికారుల నుంచి వచ్చిందని గ్రహించిన ఎంపి సిఎం రమేష్ ఏ మాత్రం తొణక్కుండా ...విషయం అడిగారు. వారు మధ్యవర్తిని తెచ్చామని నివాసంలో సోదాలని రికార్డు కెక్కిస్తామని చెప్పగా సిఎం రమేష్ ఒకవైపు నిబంధనలు గురించి వారికి గుర్తుచేస్తూనే మరోవైపు నేను మీడియా ఎదుటే ఉన్నానని...మీరు మాట్లాడే విషయాలు కూడా లైవ్ లో వెళుతున్నాయని హెచ్చరించారు. తద్వారా వారు అధికారం వినియోగించి పరిస్థితిని తమ అదుపులోకి తీసుకోకుండా ఇక్కడినుంచే నిలువరించారు. అలాగే వారు తమ వాదన కొనసాగించకుండా నిబంధనల పేరుతోనే వారి ముంగటికాళ్లకు బంధనాలు వేశారు.
అదే విషయం...మీడియాకు
అంతేకాకుండా ఆ తరువాత ఐటి అధికారులు తనకు ఫోన్ చేసిన కారణం, వాళ్ల వాదన...దాడుల సందర్భంగా వ్యవహార శైలి తదిదర విషయాలన్నీ అప్పటికప్పుడే మీడియాకు వివరించారు. సిఎం రమేష్ మీడియా ఎదుటే ఫోన్ మాట్లాడటం...ఆయన చెప్పిన విషయాలకు అందుకు సరిపోలడం సిఎం రమేష్ కు ప్లస్ పాయింట్ గా మారింది. నిబంధనల ప్రకారం రిపోర్ట్ తయారీ సమయంలో మధ్యవర్తిగా తాము సూచించిన వ్యక్తి ఉండాలని...అయితే ఐటి అధికారులు మధ్యవర్తిని కూడా వారే తెచ్చకున్నారని, దాడులు జరుపుతుంది తెలంగాణా అధికారులు కాబట్టి సహజంగానే వారు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారని...అందుకే నివాసంలోకి ఫోన్లు తీసుకువెళ్లరాదని సిఎం రమేష్ చెప్పారు. అందుకే తన సోదరిని మధ్యవర్తిగా వారు అందుకు నిరాకరించినట్లు తెలిపారు. ఇదంతా దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారని అర్థం అయిపోతుందని వివరించారు.
రాజకీయ పరిణతి...మైలేజీ
ఐటి అధికారుల నుంచి ఫోన్ అని తెలియగానే సిఎం రమేష్ కాల్ కట్ చేసినా, లేక పక్కకు వెళ్లి మాట్లాడినా దాడుల విషయంలో టిడిపి ఎంపి సిఎం రమేష్ ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు సంకేతం వచ్చేది. ఆయన మీడియా ఎదుటే ఐటి అధికారులతో మాట్లాడటంతో ఇందులో దాపరికమైన అంశాలు లేవని, తాము దాడులకు భయపడటం లేదని, ఎలాంటి సందర్భంలోనైనా దాడులను ఎదుర్కోగలమని చెప్పకనే చెప్పినట్లయింది. మీడియా ఎదుటే ఐటి అధికారులకు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిందిగా సూచించడంతో వారు అందుకు భిన్నంగా వారు ప్రవర్తించడానికి అవకాశం లేకుండా చేసినట్లయింది. తనపై ఐటి దాడుల విషయంలో సిఎం రమేష్ తాను చెప్పదల్చుకున్న విషయాన్ని ఐటి అధికారుల ఫోన్ కాల్ వ్యవహారం ద్వారా స్పాంటేనియస్ గా స్పందించి తన రాజకీయ పరిణతిని చాటకున్నారు.