కేశినేని నానీతో గల్లా జయదేవ్ భేటీ ... బుజ్జగించే యత్నం
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కేశినేని నానీని బుజ్జగించటానికి అధిష్టానం రంగంలోకి దిగింది. లోక్సభలో విప్ పదవిలో నియమించడం పట్ల అలకబూనిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేనిని బుజ్జగించేందుకు హైకమాండ్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ ను పంపించింది. ఈ నేపధ్యంలో విజయవాడలో నానితో భేటీ అయ్యారు గల్లా జయదేవ్ .
ఇద్దరు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. గల్లా జయదేవ్ కేశినేని నానీని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీపై అలక వహించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయ్దేవ్ను , అలాగే లోక్సభ ఫ్లోర్ లీడర్గా రామ్మోహన్నాయుడిని, పార్టీ విప్గా కేశినేని నానిని నియమించారు చంద్రబాబు. అయితే దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన నాని.. సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలంటూ వ్యాఖ్యానించారు. తాను ఈ పదవి స్వీకరించలేనని, తాను అంత సమర్ధుడిని కాదని పార్టీలో సమర్ధవంతమైన నేతలకు పదవులు ఇవ్వాంటూ సూచించడం పార్టీలో కలకలం రేపింది. ఇక కేశినేని మీడియాతో మాట్లాడుతూ తన ప్రకటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఫేస్బుక్లో వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. విజయవాడ ఎంపీ కంటే తనకు మరో పెద్ద పదవి లేదని వ్యాఖ్యానించారు. విప్ అంశాన్ని బూతద్దంలో చూడొద్దని.. తాను బెజవాడ ఎంపీగానే లోక్సభలో అవిశ్వాసం పెట్టానని గుర్తు చేశారు. పోరాడేందుకు పదవులు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. విభజన హామీలపై విజయవాడ ఎంపీగానే పోరాడానని స్పష్టం చేశారు నానీ.