స్నేహంతో అధికారిని తోసేశా: ఎయిర్ పోర్ట్లో రచ్చపై జేసీ సంచలన వ్యాఖ్యలు
విశాఖ విమానాశ్రయంలో జరిగిన సంఘటనపై అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి గురువారం స్పందించారు.
విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో జరిగిన సంఘటనపై అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి గురువారం స్పందించారు. విమానయాన అధికారులతో తాను అనుచితంగా ప్రవర్తించలేదన్నారు. అలాగే, విమాన సంస్థలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెచ్చిపోయిన జేసీ: విశాఖ ఎయిర్ పోర్టులో రచ్చ.. ప్రింటర్ విసిరేసి!..
విమానయాన సంస్థలు అప్పటికే టిక్కెట్లు తీసుకున్న వారివి క్యాన్సిల్ చేసి, అప్పుడే టిక్కెట్లు తీసుకునే వారుకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాయని ఆరపించారు.
స్నేహంగా తోసేశా..
తాను విమానాశ్రయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించలేదని జెసి చెప్పారు. అధికారులను టచ్ చేయలేదన్నారు. ఎవరినీ తోయలేదని, ప్రింటర్ను కిందపడవేయలేదన్నారు. అధికారి భుజంపై వెనుక నుంచి చేయి వేసి నిలదీశానని చెప్పారు. స్నేహపూర్వకంగా తోసేశానని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కౌంటర్ క్లోజ్పై నిలదీశా.. విఐపిలా అడగలేదు
తాను ఆలస్యంగా వెళ్లలేదని, తాను వెళ్లేసరికి ఇంకా విమానం అక్కడే ఉందన్నారు. అరగంట ముందే వెళ్లానని చెప్పారు. తనతో పాటు మరికొంతమంది ప్రయాణీకులు వెయిట్ చేస్తున్నారని, అదే విషయం అడిగానని చెప్పారు. ఇటీవలి కాలంలో విమాన సంస్థల చర్యలకు అంతులేకుండా పోతోందని జేసీ అన్నారు. తాను వీఐపీలా మాట్లాడలేదని, ఎంపీగా మాట్లాడలేదని, కేవలం సాధారణ ప్రయాణీకుడిలా మాట్లాడానని స్పష్టం చేశారు.
సీట్లు మిగుల్చుకొని అమ్ముకుంటున్నారు.. పార్లమెంటులో ప్రస్తావిస్తా
విమాన సంస్థలు సీట్లు మిగుల్చుకొని, చివరి నిమిషంలో ఎక్కువ ధరకు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని చెప్పారు. తాను విమానం బయలుదేరడానికి అరగంట ముందే వెళ్లానని చెప్పారు. వారివి తనపై కట్టు కథలు అన్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు.
నేనొస్తున్నానని చెప్పా.. విమానం ఎక్కించారు
తాను వస్తున్న విషయాన్ని ముందే ప్రోటోకాల్ అధికారికి చెప్పానని జేసీ అన్నారు. గొడవ అనంతరం ప్రోటోకాల్ అధికారి వచ్చి తనను విమానం ఎక్కించారని చెప్పారు. వారు ఏం చేసినా మేం నోరు మూసుకోవాలా అని ఊగిపోయారు. వారి తప్పును తాను ప్రశ్నించానని చెప్పారు. విమానాల తీరు ఆర్టీసీ బస్సులా తయారయ్యాయన్నారు.
గట్టిగా మాట్లాడానేమో కానీ..
తాను కాస్త గట్టిగా మాట్లాడి ఉండవచ్చు కానీ దౌర్జన్యం చేయలేదని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. గత ఏడాది అక్టోబర్ నెలలో గన్నవరం విమానాశ్రంలోను తాను అధికారులతో అనుచితంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ఆ రోజూ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కాగా, జేసీ విమానాశ్రయానికి ఆలస్యంగా రావడంతో ఆయనకు బోర్డింగ్ పాసును నిరాకరించారని, దీంతో ఆయన అక్కడ హంగామా సృష్టించారని, బోర్డింగ్ పాస్ ప్రింటర్ కింద పడేసారని, అధికారిని తోసేశారని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.