వెంకయ్య ఉపరాష్ట్రపతి...రాష్ట్రానికి శాపం...నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు: జేసీ సంచలనం
అనంతపురం:అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడం కూడా రాష్ట్రానికి శాపమైందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏపీపై కేంద్రం వైఖరికి నిరసనగా అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో టిడిపి ఎంపీలు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ జెసి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నంత వరకు ఏపీకి బెల్లం ముక్క కూడా ఇవ్వరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను చంద్రబాబుకు కూడా చెప్పానని పునరుద్ఘాటించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రయత్నం చేయాలని సీఎం అన్నారని జెసి తెలిపారు.
మోడీ...మోసం న్యాయమా
పదవులు వస్తున్నకొద్దీ హుందాగా వ్యవహరించాలని జెసి దివాకర్ రెడ్డి మోడీకి సూచించారు. కేంద్రం హామీలు ఇచ్చి మోసం చేయడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని మర్తాడు క్రాస్ సమీపంలో జరిగిన రైతుల సమావేశంలోనూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఆయన సొంత పార్టీ నేతలనే ఎక్కువగా టార్గెట్ చేశారు.
వెధవలు...అందుకే ఇలా
టీడీపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎందుకూ పనికిరాని వెధవలన్నారు...అందుకే ప్రభుత్వ పథకాలు సరిగా అమలుకాలేదన్నారు. ఇక కమ్యూనిస్టులు పెద్ద దొంగలంటూ వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీకి వెళ్లకముందు కమ్యూనిస్టులంటే చాలా మంచివారనే అభిప్రాయంతో ఉండేవాడిననీ, కానీ కమ్యూనిస్టులంత దొంగలు ఎక్కడా లేరని ఆ తర్వాత తెలుసుకున్నానన్నారు.
ఎవరికి...ఉపయోగం
కాగా, చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల్లో చంద్రన్న బీమా పథకం ఒక్కటే బాగుందన్నారు. ఈ విషయాన్ని ధైర్యంగా సీఎంకు చెప్పే ధైర్యం ఎవరికీ లేదన్నారు. రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం ఎవరికి ఉపయోగమో అర్థం కావడంలేదని జెసి అన్నారు. రేషన్ షాపుల్లో కొనుగోలు చేసే బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించడం జరుగుతోందన్నారు.
సిఎం...మంత్రి పదవి ఇవ్వడు
నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు, ఇచ్చినా తట్టుకోలేడు. సీఎం వల్ల నాకు ఎలాంటి లబ్ధి కలుగలేదు. నేను మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు సచివాలయంలో ఉన్న వాళ్లంతా నా దగ్గర పనిచేశారు' అని జేసీ అన్నారు. జేసీ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి తదితర టీడీపీ నేతలు నివ్వెరపోయారని తెలిసింది.