టీడీపీలో నారా శకం ముగిసినట్టే: కింజరాపు కుటుంబానికి టీడీపీ..? యంగ్ ఎంపీ ఏం చెబుతున్నారు?
శ్రీకాకుళం: కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో బాగా నానుతోన్న విషయం.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష బాధ్యతలు. ప్రత్యేకించి- తెలుగుదేశం ఈ సారి వినూత్నంగా నిర్వహించిన డిజిటల్ మహానాడు ముగిసిన తరువాత నుంచి ఈ అంశంపై తరచూ ప్రస్తావనకు వస్తోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖకు కొత్త అధ్యక్షుడిని నియమించడానికి అగ్ర నాయకత్వం దృష్టి సారించిందని, పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వెలువడుతున్నాయి.
రేసులో ఉన్నప్పటికీ..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నేత, మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావును తప్పించడం ఖాయమని, ఆయన స్థానంలో యువ నాయకుడికి ఈ బాధ్యతలను అప్పగిస్తారనేది వాస్తవమే. ఈ దిశగా తెలుగుదేశం సీనియర్ నేతల, పొలిట్బ్యూరో సభ్యులు కొంతమంది నాయకుల పేర్లను షార్ట్లిస్ట్ కూడా చేశారు. ఇందులో నెల్లూరుజిల్లాకు చెందిన బీసీ నాయకుడు బీదా రవిచంద్ర యాదవ్, శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రెడ్డి సామాజిక వర్గం నుంచి మరికొంత మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
కింజరాపుకే ఛాన్స్ అంటూ..
అదలావుంచితే- టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కింజరాపు రామ్మోహన్ నాయుడి పేరు దాదాపు ఖరారైందని, దీన్ని అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందనే సమాచారం మీడియాలో వస్తోంది..ప్రత్యేకించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో కింజరాపు పేరు బలంగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడి పగ్గాలను అందుకుంటారనే కామెంట్లూ ఉన్నాయి. ఆయనకు తప్ప మరొకరికి ఆ శక్తి సామర్థ్యాలు లేవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఓ అడుగు ముందుకేసిన వారియర్స్..
ఇదే క్రమంలో- రామ్మోహన్ నాయుడు వారియర్స్ అనే ట్విట్టర్ అకౌంట్ నిర్వాహకులు ఓ అడుగు ముందుకు వేశారు. కొన్ని ప్రత్యేక, సంక్షోభ పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీ.. నందమూరి కుటుంబం చేతుల నుంచి నారా కుటుంబం చేతుల్లోకి వెళ్లిందని, అవే తరహా పరిస్థితులు ఇప్పుడూ తలెత్తాయని పేర్కొంటున్నారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దారుణంగా ఓటమి పాలై తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొందని అంటున్నారు. ఈ సంక్షోభ సమయంలో టీడీపీ.. ఈ సారి నారా కుటుంబం నుంచి కింజరాపు కుటుంబం చేతుల్లోకి రావడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తున్నారు.
స్పెషల్ స్టేటస్ తెచ్చే సత్తా
కింజరాపు రామ్మోహన్ నాయుడు తన వాగ్ధాటితో ఢిల్లీలో బీజేపీ వాళ్లకి వణుకు తెప్పించగలడని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకుని రాగల సత్తా ఆయనకు మాత్రమే ఉందని ఈ ట్విట్టర్ అకౌంట్లో పోస్టులు కనిపిస్తున్నాయి. అలాగే నారా లోకేష్ను ఉద్దేశించి- తన బరువుతో సైకిల్ ని విరగ్గొట్టగలిగే వాడు ఒకరు, సైకిల్ని భుజానికెత్తుకొని బరువు బాధ్యతలు మోయగల సమర్థుడైన యువకుడు ఒకరు..
తెలుగుదేశం పార్టీలో నారా శకం ముగిసినట్లేనని, ఇక తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ నాయుడిదేననే పోస్టులు విస్తృతంగా ఉన్నాయి.
కింజరాపు ఏం చెబుతున్నారు?
ఈ పోస్టులపై కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు వారియర్స్ అనే ట్విట్టర్ అకౌంట్తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ట్విటర్ వేదికగా తప్పుడు ప్రచారాన్ని సహించబోనని అన్నారు. తన అభిమానులు ఇలాంటి చర్యలకు పాల్పడరని వివరణ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి అధినాయకత్వం చెప్పకుండానే మీడియాలో కథనాలు రాయడం తగదని అన్నారు.
Recommended Video
చట్టపరమైన చర్యలకు
తమ కుటుంబానికి వేరే అజెండా అంటూ ఏమీ లేదని, పార్టీ తల్లిలాంటిదని అన్నారు. తనకు గానీ, తన సోదరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి గానీ పార్టీ అధినేత చంద్రబాబు మాటే శిరోధార్యం అని అన్నారు. తన పేరు మీద నకిలీ అకౌంట్లు సృష్టించిన వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. దీనిపై తాను ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ట్విట్టర్ యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.