కరోనాపై యుద్ధానికి టీడీపీ ఎంపీ భారీగా నిధులు కేటాయింపు: జగన్కు బదులుగా ఆయనకు లేఖ..!
విజయవాడ: రోజురోజుకూ భయానకంగా విస్తరిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి ఇప్పుడిప్పుడే భారీ ఎత్తున విరాళాలు ఆరంభం అయ్యాయి. కొందరు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కొన్ని కార్పొరేట్ సంస్థల యజమానులు దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని ప్రకటించారు.
తాజాగా- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని అయిదు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. తన ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని బదలాయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్కు లేఖ రాశారు. తన ఎంపీల్యాడ్స్ నుంచి అయిదు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నానని, దీన్ని కరోనా వైరస్ను నియంత్రించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల కోసం వినియోగించాలని సూచించారు.
ఈ మహమ్మారిని నియంత్రించడానికి తన నియోజకవర్గం పరిధిలో అధికార యంత్రాంగం విస్తృతంగా కృషి చేస్తోందని ప్రశంసించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు, డాక్టర్లు నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, కరోనా వైరస్ నియంత్రణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. తన నియోజకవర్గం విజయవాడలో పాజిటివ్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందని, ఈ వైరస్ మరొకరికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Recommended Video
కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బదులుగా.. జిల్లా కలెక్టర్కు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని స్వయంగా కలుసుకోవడమో లేక, నేరుగా ఆయనకే లేఖ రాయడమో చేస్తుంటారు. దీనికి భిన్నంగా కేశినేని నాని జిల్లా కలెక్టర్కు లేఖ రాయడం ప్రత్యేకతను చాటుకున్నట్టయింది.