కేశినేని నాని వెనుక ఉన్నదెవరు: కొడాలి నాని పై తాజా పోస్టింగ్తో అలజడి : అసలు టార్గెట్ ఆయనే..!
టీడీపీ ఎంపీ కేశినేని ఇప్పుడు సొంత పార్టీలో స్వపక్షంలో విపక్షంలా మారారు. పోరాడితే పోయేదీ ఏమీ లేదు బానిస సంకెళ్ల తప్ప అంటూ..తన పోరాటం సొంత పార్టీ మేదే అనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేసారు. టీడీపీ అధినేత స్వయంగా ఆహ్వానించి మాట్లాడినా ఎక్కడా తగ్గటం లేదు. తాజాగా ఆయన మాజీ మంత్రి ఉమా..తాజా మంత్రి నాని పైన ఆయన చేసిన తాజా పోస్టింగ్ సంచలనంగా మారింది. ఇంతకీ అసలు నాని టార్గెట్ చేస్తుందెవరిని.. నాని వెనుక ఉన్నదెవరు..ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..
టీడీపీలో మింగుడు పడని కేశినేని..
విజయవాడ ఎంపీ కేశినేని టీడీపీ అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. కేశినేని ఇప్పుడు టీడీపీలో ఒక రకంగా అసమ్మతి నేతగా మారారా అనే అనుమానం వస్తోంది. తొలి సారి ఎంపీగా ఉన్నప్పుడూ ఆయన అదే వైఖరితో ఉన్నారు. ఏపీలో ప్రయివేటు బస్సుల పైన అధికారుల తీరుపైన మండిపడిన కేశినేని నాడు పార్టీ నేతలతో కలిసి అప్పటి రవాణా కమిషనర్ బాల సుబ్రమణ్యం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, ఆ తరువాత తన ప్రయివేటు ట్రావెల్స్ వ్యాపారం వద్దని డిసైడ్ అయ్యారు. ఇక, ఏపీలో రవాణా శాఖలోని లోపాల పైన నేరుగా నాటి రవాణా మంత్రి అచ్చంనాయుడు పైన పరోక్షంగా ఆరోపణలు చేసారు. కేంద్రంతో టీడీపీ తెగ తెంపులు చేసుకున్నా..కేశినేని నాని మాత్రం బీజేపీ అగ్ర నేతలతో తన సాన్నిహిత్యం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది టీడీపీ అధినాయకత్వానికి రుచింటచం లేదు.
తాజా పోస్టింగ్తో కలకలం..
రెండో సారి ఎంపీగా ఎన్నికైన తరువాత కేశినేని నాని ఈ సారి సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలకు టెన్షన్ పుట్టిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పోరాడితే పోయేదేమీ లేదంటూ పోస్ట్ పెట్టి..తాను టీడీపీలోనే ఉంటూ పోరాటం చేయాలనే నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు. తాజాగా..జగన్ కేబినెట్లో మంత్రి అయిన కొడాలి నానిని ఉద్దేశించి చేసిన పోస్టింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. "కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడి గా ఉండాలి!!!" అని కేశినేని నాని షాకింగ్ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ వెనుక అసలు లక్ష్యం మాజీ మంత్రి దేవినేని ఉమా అనే విషయం స్పష్టమవుతోంది. కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమా మాటలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వటం పైన కేశినేని ఆగ్రహంతో ఉన్నారు. దేవినేని అవినాశ్కు గుడివాడ టిక్కెట్ ఇప్పించి కొడాలి నాని గెలుపుకు పరోక్షంగా సహకరించారని కేశినేని భావనగా కనిపిస్తోంది.
టార్గెట్ దేవినేని..వెనుక ఉన్నదెవరంటే..
టీడీపీకి సంస్థగతంగా..సామాజికంగా బలం ఉన్న కృష్ణా జిల్లాలో టీడీపీ ఓడటానికి కారణం దేవినేని ఉమానే కారణమని కేశినేని భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో గల్లా..కృష్ణాలో దేవినేని కారణంగానే పార్టీ ఓడిందనేది ఆయన భావన. దీంతో ఆయన పార్టీ కోసమంటూనే వారిద్దరి లక్ష్యంగా పరోక్షంగా పోస్టింగ్లు పెడుతున్నారు. ఇక, ఆయనకు బీజేపీ కేంద్ర నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల ద్వారా భవిష్యత్ రాజకీయాలకు ఇప్పటికే బాట ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికైతే టీడీపీని వీడాలనే ఆలోచనలో కేశినేని నాని లేకపోయినా..భవిష్యత్లో టీడీపీలోనే కొనసాగు తారనే గ్యారంటీ మాత్రం కనిపించటం లేదు. ఏపీలో వైసీపీ పనితీరు గమనించి...టీడీపీ భవిష్యత్ పైన అంచనా వేసాక.. కేశినేని నాని రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన బీజేపీని మచ్చిక చేసుకొనే వ్యూహం అమలు చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది.