చంద్రబాబు మరో యూటర్న్? బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం? కేశినేని నానితో రాయబారం?
Recommended Video
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకోబోతున్నారా? భారతీయ జనతాపార్టీ పంచన చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఎన్డీఏ నుంచి బయటికి రావడం ఘోర తప్పిదమని ఇదివరకే ఓ నిర్ణయానికి వచ్చిన ఆయన మరోసారి అదే కూటమిలోకి వెళ్లడానికి రాయబారం నడిపిస్తున్నారా? దీనికోసం ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మద్దతును ఆశిస్తున్నారా? రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తోంటే- ఇది నిజమే అనిపిస్తోంది. ఎన్డీఏలో చేరడం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని వచ్చి పూర్వవైభవాన్ని సాధించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబుకు ఫోన్ చేశారా?
ఇందులో భాగంగా ఆయన- విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నానిని రాయబారానికి పంపించారని తెలుస్తోంది. కేశినేని నాని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడితో భేటీ కావడం, సుమారు అరగంటకుపైగా వారిద్దరి మధ్య చర్చలు సాగడం అనేక సందేహాలను లేవనెత్తింది. ఈ సమావేశంలోనే కేశినేని ఫోన్ ద్వారా చంద్రబాబును వెంకయ్య నాయుడితో మాట్లాడించారని అంటున్నారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్పై చర్చించారని సమాచారం.
వెంకయ్య నాయుడు ఏం చెప్పారు?
బీజేపీతో సత్సంబంధాలను నెలకొల్పడంలో ప్రస్తుతం తానేమీ చేయలేనని వెంకయ్య నాయుడు కరాఖండిగా తేల్చేసినట్లు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున తాను ఎలాంటి మంతనాలు చేయబోనని ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను తాను సూచించగలుగుతానే తప్ప.. ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేనని వెంకయ్య నాయుడు వెల్లడించినట్లు చెబుతున్నారు. బీజేపీకి దగ్గర కావడానికి గల మార్గాలను మాత్రమే తాను సూచించగలుగుతానని పేర్కొన్నట్లు సమాచారం.
టీడీపీ-బీజేపీ పొత్తు కోసం..
2014 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ-బీజేపీ మధ్య పొత్తు కుదురడానికి, సీట్లను సర్దుబాటు చేసుకోవడానికి వెంకయ్య నాయుడే ప్రధాన కారణం అనేది బహిరంగ రహస్యం. అప్పటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఛరిష్మా, బీజేపీ హవా బలంగా వీచింది. జీవితంలో బీజేపీతో పొత్తు కుదుర్చుకోబోనని బహిరంగంగా శపథం చేసిన చంద్రబాబు తన ఒట్టును తీసి గట్టున పెట్టారు. ప్లేటు ఫిరాయించారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
తదనంతరం- సుమారు నాలుగేళ్ల పాటు చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా వెంకయ్య నాయుడి అండదండలు ఉన్నప్పటికీ.. రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయలేదనే ఆరోపణలు అప్పట్లో వినిపించినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రత్యేక హోదాకు బదలుగా ప్యాకేజీ ఇస్తామంటే తల ఊపారు. జనంతో కూడా తల ఊపించేలా విఫల ప్రయత్నాలు చేశారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని తాము నిర్మిస్తామని అంటూ కేంద్రం నుంచి ఆ పనులను తన చేతికి బదలాయించుకున్నారు చంద్రబాబు. దీని వెనుక వెంకయ్య నాయుడి మంత్రాంగమే పని చేసిందని అంటున్నారు.
ఉప రాష్ట్రపతిగా నియమించడంతో అడ్డం తిరిగిన టీడీపీ కథ
అదే సమయంలో- వెంకయ్య నాయుడిని అనూహ్యంగా ఉప రాష్ట్రపతిని చేసింది బీజేపీ. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించేలా రాజ్యాంగ బద్ధమైన పదవిలో కూర్చోబెట్టింది. చంద్రబాబు కూడా ఏ మాత్రం ఊహించని పరిణామం అది. వెంకయ్య నాయుడిని ఉప రాష్ట్రపతిని చేయడం, రాజకీయాల్లో ఆయన జోక్యం లేకపోవడం వల్ల చంద్రబాబు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఆయనను ఉప రాష్ట్రపతిని చేసిన ప్రభావం చంద్రబాబు మీద ఏ స్థాయిలో మనకు తెలిసిన విషయమే. ఏకంగా బీజేపీతో తెగదెంపులు చేసుకోవాల్సి వచ్చింది చంద్రబాబుకు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్కు దగ్గర అయ్యారు.
ఒంటరిపోరుతో చిత్తు చిత్తు!
తన హయాంలో ఏనాడూ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేని చంద్రబాబు.. దీనికి భిన్నంగా వ్యవహరించాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితితోనూ పొత్తులకు ప్రయత్నించి ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు చేసుకోలేక సతమతం అయ్యారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లారు. అత్యంత దారుణ పరాజయాన్ని చవి చూశారు. ఇదంతా కేవలం ఒక్క వెంకయ్య నాయుడు అండ లేకపోవడం వల్లే చంద్రబాబు ఇన్ని వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
విపత్కర పరిస్థితుల్లో మరోసారి ఆయన వద్దకే..
ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో తమను ఆదుకునేది ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమేనని గ్రహించారు చంద్రబాబు. అందుకే- కొద్దో, గొప్పో బీజేపీకి దగ్గర అయ్యేలా మరోసారి వెంకయ్య నాయుడిని ఆశ్రయించారని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా- తన పార్టీ లోక్సభ సభ్యుడు కేశినేని నానిని వెంకయ్య నాయుడి వద్ద రాయబారానికి పంపించినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీతో తప్ప మరో పార్టీతో కలవలేని పరిస్థితిని ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోవడంతో తనకు చక్రం తిప్పే అవకాశం రాలేదని చంద్రబాబు మథన పడుతున్నారని అంటున్నారు.
వారిద్దరూ ఉండగా.. నాని ఎందుకు?
ఇక్కడ ఇంకో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హస్తిన స్థాయిలో కేశినేని నాని ఏనాడూ మంతనాలు సాగించిన దాఖలాలు లేనే లేవు. ఎప్పుడు చూసినా కంభంపాటి రామ్మోహన్ రావు, సీఎం రమేష్, సుజనా చౌదరి ఆ స్థాయిలో రాజకీయాలను నెరపుతుంటారు. ఈ సారి ఈ ముగ్గురినీ కాదని కేశినేని నానిని చంద్రబాబు రాయబారానికి పంపించారని అంటున్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు గతంలో బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కొత్తగా కేశినేని నానిని రంగంలో దింపారని తెలుస్తోంది.