ఆర్టీసీ విలీనం విషయంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నానీ ప్రశంసలు : ఏపీలో కొత్త చర్చ
తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ఆర్టీసీ విలీనం విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించడం ఇప్పుడు ఏపీ లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఆర్టిసి ఆసుపత్రిలో కేశినేని నాని ఎంపీ నిధులతో నిర్మించిన భవనాన్ని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ విలీనం అంశంపై రవాణా శాఖ మంత్రి మాట్లాడారు. ఇక ఇదే సమయంలో కేశినేని నాని సైతం ఆర్టీసీ విలీనం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయమని, ఆర్టీసీని విలీనం చేయాలనుకోవటం శుభ పరిణామమని అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల ఆస్పత్రిలో రోగుల సహాయకుల కోసం ఎంపీ కేశినేని నాని కల్పించిన వసతి భవనాన్ని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రారంభించిన సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. ఇక కేశినేని నాని వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ ఎంపీ కేశినేని నాని ప్రశంసించారని ఆయన కొనియాడారు.
ఆర్టీసీ ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం వసతి అందిస్తున్న ఎంపీ కేశినేనిపై మంత్రి పేర్ని నాని ప్రశంసల జల్లు కురిపించారు. ఇక ఆర్టీసీ విలీనం విషయంలో చంద్రబాబు మౌనంగా ఉంటే ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని వైసిపి ప్రభుత్వాన్ని ప్రశంసించడం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. గత కొంతకాలంగా కేశినేని నాని తన వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇరకాటంలో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు కేశినేని నాని ఆర్టీసీ విలీనం గురించి మాట్లాడి చంద్రబాబుని ఇరకాటంలో పెట్టారు.