బీజేపీలోకి ఎంపీ కేశినేని నాని..!! కీలక నేతలతో మంతనాలు - చంద్రబాబు ఫొటోలు తీసేసి..!!
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని పార్టీ వీడేందుకు సిద్దమయ్యారా. ఆయన కాషాయం కండువా కప్పుకోబోతున్నారా. బెజవాడ టీడీపీ నేతలు మాత్రం అవుననే సమాధాన ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో సారి వరుసగా టీడీపీ ఎంపీగా గెలుపొందారు. గెలిచిన సమయం నుంచి పార్టీ అధినాయకత్వం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నారు. క్రిష్ణా జిల్లాలో మొత్తం పార్టీ ఓడినా.. 2019 ఎన్నికల్లో తాను గెలవటంతో పాటుగా తన పార్లమెంటరీ పరిధిలో పార్టీకి వచ్చిన ఓట్ల గురించి పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
టీడీపీకి దూరంగా కేశినేని నాని
కొద్ది రోజుల క్రితం తాను ఎంపీగా మాత్రమే కొనసాగుతానని..పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని చెబుతూనే.. తనతో పాటుగా తన కుమార్తె సైతం పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటారని స్పష్టం చేసారు. బెజవాడ నగరంలోని పార్టీ నేతలు..క్రిష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పైన కేశినేని గుర్రుగా ఉన్నారు. వారి కారణంగానే పార్టీ జిల్లాలో నష్టపోయిందనేది కేశినేని వాదన. తాను అధినాయకత్వానికి ఇదే అంశం పైన ఎన్ని సార్లు చెప్పినా..ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం పైన ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు..పార్టీ నేతల తీరుపై అసహనం
తాజాగా, తన కుమార్తె శ్వేతను విజయవాడ మేయర్ అభ్యర్దిగా రంగంలోకి దించారు. ఆ సమయంలో పార్టీ నగర నేతలు తొలుత వ్యతిరేకించారు. ఆ తరువాత ఎన్నికల్లో తగిన సహకారం అందించలేదనేది కేశినేని వర్గం వాదన. దీంతో.. పార్టీ అధినాయకత్వం తీరు మారకపోవటంతో తాను పార్టీలో ఉండి ఉపయోగం లేదనే భావనతో కేశినేని ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఆయన తాజాగా తన కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు-జిల్లా- విజయవాడ నగరానికి చెందిన పార్టీ నేతల ఫొటోలను తీసేసారు. కేశినేని కార్యాలయం గోడ పైన..ఆఫీసులోని గ్రౌండ్ ఫ్లోర్..తొలి అంతస్థులోనూ పార్టీ నేతల ఫొటోలను తొలిగించారు.
చంద్రబాబు ఫొటో స్థానంలో రతన్ టాటా
చంద్రబాబు ఫొటో స్థానంలో తాను రతన్ టాటాతో ఉన్న ఫొటోను..పార్టీ నేతల ఫొటోల స్థానంలో తాను చేసిన సేవా కార్యక్రమాల ఫొటోలను కేశినేని నాని ఏర్పాటు చేసారు. దీని ద్వారా తాను వారి నాయకత్వానికి దూరం అవుతున్నానే సంకేతాలను నాని ఇచ్చినట్లుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక, కేశినేని తొలి సారి గెలిచిన సమయం నుంచి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు..బీజేపీ ముఖ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు సైతం ఆయన బీజేపీ ముఖ్య నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బీజేపీ నేతలతో సత్సంబంధాలు
కేంద్ర మంత్రులు గడ్కరీ.. రాజ్ నాధ్ సింగ్ లతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. టీడీపీ కార్యక్రమాలకు ఇప్పటికే పూర్తిగా దూరమైన కేశినేని నాని..తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయనని తేల్చి చెప్పారు. తాను ఎంతగా చెప్పినా.. చంద్రబాబు తన మాటలను పట్టించుకోకపోవటంతో ఇక పార్టీలో ఉండి ఉపయోగం లేదనే భావనతో నాని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం అయినట్లు ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల తరువాత టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వేంకటేశ్, సీఎం రమేష్ బీజేపీలో చేరారు.
బీజేపీకి దగ్గరవుతున్న కేశినేని నాని..!
వారి విషయంలో చంద్రబాబు ఎటువంటి వ్యతిరేక చర్యలు తీసుకోలేదు. వారిని చంద్రబాబే బీజేపీలోకి పంపించారనే ప్రచారం సాగినా దానికి టీడీపీ నేతలు సరైన సమాధానం ఇవ్వలేదు. అయితే, ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఆకస్మికంగా చంద్రబాబుతో సహా పార్టీ నేతల ఫొటోలు తీసేయటం... సేవా కార్యక్రమాల ఫొటోలు తీసేయటం ద్వారా తాను టీడీపీ నుంచి వచ్చిన పదవి వదులుకొనేందుకు సిద్దమయ్యారా అనే మరో ప్రశ్న వినిపిస్తోంది. అయితే, నాని ఎంపీగానే కొనసాగుతారని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.
Recommended Video
బీజేపీలో చేరటం ఖాయమైందా..
వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన బీజేపీ నుంచే పోటీ చేస్తారని..అప్పటి వరకు టీడీపీలోనే ఉంటూ ఎంపీ గా మాత్రమే బాధ్యతలకు పరిమితం అవుతారనది మరో వర్గం వాదనగా వినిపిస్తోంది. ఇప్పుడు మరో రెండేళ్ల కాలంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న సమయంలో టీడీపీ ఎంపీగా గెలిచి..కొనసాగుతూ బీజేపీలో చేరే అవకాశం లేదని చెబుతున్నారు.
కానీ, బీజేపీతోనే నాని కలిసి అడుగులు వేయటం మాత్రం ఖాయమని తెలుస్తోంది. టీడీపీకీ మంచి పట్టు ఉన్న విజయవాడ నగరంలో కేశినేని నాని పార్టీకి దూరమైతే అది ఖచ్చితంగా టీడీపీకి రాజకీయంగా భారీ నష్టం తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ పరిణామాల పైన టీడీపీ అధినాయకత్వం .. స్థానిక నేతల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు.