చంద్రబాబు ఫోన్! ఉలకని, పలకని కేశినేని నాని!
విజయవాడ: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరువాత కూడా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి గళం, అసంతృప్తి సెగలు బహిర్గమౌతూనే ఉన్నాయి. అలకలు, బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే వస్తోంది. తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికైన ముగ్గురి నేతల్లో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి నెలకొంది. పదవుల పంపకాల తరువాత చెలరేగిన అసంతృప్తిని చల్లార్చడానికి ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్వయంగా ఆయనే ఫోన్ చేసి, బుజ్జగించేంత వరకూ వెళ్లింది.
మొన్నటి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ మూడు లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఈ ముగ్గురిలో రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్లకు కాస్త ప్రాధాన్యత గల పోస్టులను ఇచ్చారు చంద్రబాబు. కేశినేని నానికి విప్ పదవికి కట్టబెట్టారు. మిగిలిన ఇద్దరితో పోల్చుకుంటే తనకు ప్రాధాన్యత తక్కువగా ఉన్న పోస్ట్ను ఇచ్చారనే అసంతృప్తి కేశినేని నానిలో వ్యక్తమౌతోంది.
ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు కూడా. విప్ హోదాను తాను తీసుకోవట్లేదని తేల్చి చెప్పారు. పార్టీ అధినేత నిర్ణయం పట్ల ఆయన అసమ్మతి గళాన్ని వినిపించారు. పైగా కొంతకాలంగా ఆయన భారతీయ జనతాపార్టీతో టచ్లో ఉంటున్నారు. తాను ఎన్నికైన కొద్దిరోజులకే ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడును అదే పనిగా ఢిల్లీకి వెళ్లి మరీ కలిశారు. ఆ తరువాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోనూ భేటీ అయ్యారు. ఈ పరిణామాలన్నీ కేశినేని నాని పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయనే వార్తలను పుట్టించాయి.
వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని- ఏకంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. బుజ్జగింపు చర్యలు చేపట్టారు. స్వయంగా కేశినేని నానికి ఫోన్ చేశారు. అయినప్పటికీ- ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. తనను కాదని గల్లా జయదేవ్ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయంపై నాని ఆగ్రహానికి, అసంతృప్తికి కారణమైందని చెబుతున్నారు. పార్టీలో చాలాకాలం నుంచి కొనసాగుతున్నానని, మధ్యలో కాంగ్రెస్ నుంచి వచ్చిన గల్లా జయదేవ్ కుటుంబానికి పార్టీలో పదవులను కట్టబెట్టడం ఏమిటని ఆయన వాపోతున్నారు.