కర్ణాటకలో బిజెపికి మెజార్టీ రాలేదంటే...కారణం మా తిరుమల వెంకన్న చౌదరి:మురళీ మోహన్
రాజమండ్రి: అత్యుత్సాహమో...లేక గందరగోళమో తెలీదు కానీ కొందరు రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు దిగ్బ్రాంతి కలిగిస్తాయి...తాజాగా టిడిపి ఎంపి మురళీ మోహన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి తిరుమల వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలు దెబ్బతినేందుకు కారణమయ్యారు.
కర్ణాటక ఎన్నికల్లో రకరకాల మతలబులు చేసినప్పటికీ బీజేపీకి మెజార్టీ రాకపోవడానికి కారణం మా తిరుమల తిరుపతి వెంకన్న చౌదరి అంటూ ఎంపీ మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. సందర్భాన్ని బట్టి చూస్తే అవి తిరుమల వెంకటేశ్వరుని ఉద్దేశించి అన్నట్లుగా ఉన్నాయి. అయితే ఆయన ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా ఫ్లోలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆయన వ్యాఖ్యల వీడియోను పరిశీలిస్తే అర్థం అవుతోంది.
కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామని బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నా చంద్రుడు మాత్రం ఒక్కడే అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మురళీమోహన్ చంద్రబాబు నుద్దేశించి అన్నారు.
టిటిడి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా విమర్శలు చేస్తున్నారంటూ టిటిడి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైఖరికి నిరసనగా మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని టిటిడి ఉద్యోగులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు వైఖరికి నిరసనగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు,అర్చకులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించడాన్ని సీనియర్ నటి, బీజేపీ మహిళా నేత కవిత ఖండించారు. ఇప్పటికే టిటిడి వారు శ్రీవారి ఆలయం పరువు తీస్తున్నారని, ఇప్పుడు ఇలా నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టడం చాలా బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరారు.