జగన్కు విజ్జప్తి, చంద్రబాబు వేసిన రోడ్డుకాదు, ఇలా ఇంకెన్ని రోజులు: మురళీమోహన్ కోడలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ కోడలు రూప విమర్శల వర్షం కురిపించారు. జగన్ తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Recommended Video
చదవండి: జగన్! 24 గంటలు టైమిస్తున్నా లేదంటే: మురళీ మోహన్ కోడలు హెచ్చరిక
ఆధారాలు ఉంటే విమర్శలు చేయాలి
తాను తప్పు చేసినట్లు తేలితే ఏ కేసులకైనా సిద్ధమని రూప అన్నారు. ఇతరులపై ఆలోచన చేసే ముందు ఆలోచన చేయాలని, ఆధారాలుంటేనే విమర్శలు చేయాలన్నారు. ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న భూములను, తమకు ప్రభుత్వం కేటాయించిందని జగన్ చెప్పడం సరికాదన్నారు.
మాకేం సంబంధం లేదు
అసలు ఆ భూములు రైతులవి కావని, ఏపీఐఐసీకి చెందినవి అని రూప చెప్పారు. అయినా ఆ భూములను అలీఫ్ అనే వారికి కేటాయించారని, జగన్ చెబుతున్నట్లుగా యాభై, అరవై ఎకరాలు కాదని, 34కు పైగా ఎకరాలు అని చెప్పారు. పైగా ఆ సంస్థకు (అలీఫ్) తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కావాలంటే ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చునని చెప్పారు.
నాకు సామాజిక కార్యక్రమాలపట్ల ఆసక్తి
తనకు సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి అని రూప చెప్పారు. మంచి కార్యక్రమాలు చేపట్టే సంస్థలతో కలిసి పని చేస్తుంటానని తెలిపారు. అలీఫ్తో తన మామ మురళీ మోహన్ లేదా తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.
ఇంకా ఎన్ని కిలోమీటర్లు అలా నడుస్తారు
వైయస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లపై నడుస్తూ చేయడం లేదని, అబద్దాలపై నడుస్తూ చేస్తున్నారని రూప ఎద్దేవా చేశారు. ఇప్పటికే చాలా కిలోమీటర్లు అబద్దాలపై నడిచారని, ఇంకా ఎన్ని కిలోమీటర్లు అబద్దాలు చెప్పుకుంటూ వెళ్తారో అన్నారు. జగన్కు ఓ విజ్జప్తి అని, ఏపీకి మరో పదేళ్ల పాటు మంచి ప్రతిపక్ష నేత కావాలని కోరుకుంటున్నానని, కొంచెం నైతిక విలువలు ఉన్న వారు ప్రతిపక్ష నేత కావాలని కోరుకుంటున్నామని చెప్పారు.