ప్రధాని మోడీని కలిసిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, కారణం ఇదే
అమరావతి/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని అనంతరం ఎంపీ చెప్పారు. పెళ్లి విషయమై ఆహ్వానించేందుకు కలిసినట్లు తెలిపారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన మనవరాలి వివాహం ఉందని, ఈ పెళ్లికి ఆహ్వానించానని, ప్రధానమంత్రికి వివాహ పత్రికను అందించానని చెప్పారు. అలాగే నియోజకవర్గ సమస్యలపై ప్రధానికి వివరించానని చెప్పారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. మోడీతో భేటీకి రాజకీయ కారణాలు లేవన్నారు.
ఇదిలా ఉండగా, పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఇచ్చిన అనుమతులను దాటి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,400 కోట్లు అదనంగా ఖర్చు చేసిందని, సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేస్తేనే ప్రాజెక్టు ముందుకు సాగుతుందని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అనుమానాలు లేవనెత్తారు. వాటికి సోమవారంకల్లా పూర్తి సమాధానం ఇస్తామని ఏపీ అధికారులు చెప్పారు. అంచనాలకు సంబంధించి కేంద్ర జల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎలాంటి వివాదాలు లేవని కేంద్రమంత్రి గడ్కరీకి కేంద్ర జల సంఘం ఛైర్మన్ మసూద్ అహ్మద్ ఈ సందర్భంగా చెప్పారు.
భేటీ తర్వాత ఏపీ జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. సవరించిన అంచనాల ఆమోదం ప్రక్రియ పురోగతిలో ఉందని, గత పదిహేను రోజులలో లోటుపాట్లు సరిదిద్దామని, తాజా సమావేశంలో రెండు మూడు అంశాలపై సమాచారం అడిగారని, అదంతా సీడబ్ల్యూసీకి కావాల్సిన ఫార్మాట్లో తయారుచేసి సోమవారం వరకు ఇస్తామని చెప్పామని అన్నారు. భూసేకరణ పరిధి పెంపు తదితర అంశాలపై అడిగారన్నారు.