'మోడీని వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్కు టీడీపీ సహకారం'
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. మోడీని బీజేపీకి చెందిన నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారని బాంబు పేల్చారు.
బాబుతో కమల్హాసన్ భేటీ?: మోడీకి 'దక్షిణాది' చెక్, ఆ తర్వాతే గొంతుపెంచిన టీడీపీ అధినేత!
ప్రధాని మోడీపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందని చెప్పారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసి, ఆ తర్వాత ప్యాకేజీ ఇస్తామని చెప్పారని, అదికూడా ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు.
అప్పుడే బీజేపీని నమ్ముతాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే తాము బీజేపీని నమ్ముతామని రాయపాటి తేల్చి చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం అవసరమైతే తాము రాజీనామాలు చేయడానికైనా, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికైనా సిద్ధమని చెప్పారు.
పొత్తుపై బాబు ఆదేశాల కోసం వెయిటింగ్
బీజేపీతో పొత్తు కొనసాగుతుందా, లేదా అన్న విషయం త్వరలో తేలిపోతుందని మరో బాంబు పేల్చారు. చంద్రబాబు నాయుడు మార్గదర్శకాల కోసం తాము వేచి చూస్తున్నామని చెప్పారు. 2019లో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందన్నారు.
ఏం చేసినా అధికారంలోకి రాలేదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పైన రాయపాటి స్పందించారు. ఆయన పాదయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా అధికారంలోకి రాలేడన్నారు.
పవన్ కళ్యాణ్కు టీడీపీ సహకారం
ఏపీకి న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే తాము జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి పోరాడుతున్నామని చెప్పారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ సహకారం ఉంటుందని చెప్పారు.
జగన్పై జవహర్ ఘాటు వ్యాఖ్యలు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై, వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డిలపై మంత్రి జవహర్ శుక్రవారం మండిపడ్డారు. అధికారులను బెదిరించిన విజయసాయి రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నారు. జగన్ ఐఏఎస్లు, ఐపీఎస్లను బెదిరిస్తుంటే విజయసాయి అదే దారిలో నడుస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా అధికారులను బెదిరిస్తున్నారని, వైసీపీ నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అధికారులపై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు.