ఆ టీడీపీ ఎంపీ బీజేపీలోకి జంప్ అవుతాడా ? ఆయన అసహనానికి కారణం ఏంటి ?
ఏపీలో టీడీపీ చావు దెబ్బ తింది. ఊహించని రీతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది . ఇక ఎన్నికల ఫలితాల తర్వాత అసలే ఓటమి బాధలో ఉన్న చంద్రబాబుకు షాక్ ఇవ్వటానికి సిద్ధం అవుతున్నారు సొంతపార్టీ నేతలు . గత కొంత కాలంగా టీడీపీ పట్ల తీవ్ర అసహనంతో ఉన్న నేతలు ఇప్పుడు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అధికారానికి దూరమైనా టీడీపీ నుండి ఒక్కొక్క నేత దూరమౌతున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం నేతలు తమ దారి తాము చూసుకొంటున్నారు.
బీజేపీ వైపు చూస్తున్న కేశినేని నాని .. నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ నానీ
రాజకీయ నాయకులు పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీగా చేసేస్తారు. అప్పుడే తిట్టి అంతలోనే పొగుడుతారు. అందులోనూ పార్టీ అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైపు నేతలు మొగ్గు చూపటం సహజం . తాజాగా ఏపీలో ఘోర పరాజయం పాలైన టీడీపీలో కొందరు నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నానీ కూడా పార్టీ మారుతున్నరన్న ప్రచారం జోరుగా సాగుతుంది. . టీడీపీ తరపున వరుసగా రెండోసారి విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని ఈ మధ్య బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవడం కొత్త చర్చకు తెరతీస్తోంది. ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని... అందుకే నితిన్ గడ్కరీ ద్వారా కేంద్రంలోని అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఒక పక్క బీజేపీ తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రాలలోని టీడీపీ నేతలను ఆపరేషన్ కమల అంటుంది. అందులో భాగంగా రాం మాధవ్ రంగంలోకి దిగారు.
టీడీపీ నుండి ఆ పదవి ఆశించిన నానీ ... అధినేత ఇవ్వకపోవటంతో అసహనం
మరోవైపు కేశినేని నాని టీడీపీని వీడి వెళ్ళాలి అనే ఆలోచనకు మరో కారణం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కేశినేని నానీ టీడీపీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. టీడీపీ తరపున గెలిచిన ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు గెలిచారు. అందులో రామ్మోహన్ నాయుడికి టీడీపీ లోక్సభాపక్ష నేతగా అవకాశం కల్పించిన చంద్రబాబు... గల్లా జయదేవ్కు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో తనకు ఎలాంటి పదవి లభించలేదనే భావనలో ఉన్న కేశినేని నాని... అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీలో బలపడాలనే భావనలో ఉన్న బీజేపీ సైతం కేశినేనిని పార్టీలో చేర్చుకోవడంపై ఆసక్తి చూపుతోందని టాక్.
చంద్రబాబు పాల్గొన్న ఇఫ్తార్ పార్టీకి కూడా హాజరు కాని నానీ ... జంప్ అవుతారా ?
ఇక తాజాగా చంద్రబాబు నిన్న విజయవాడలో నానీ సొంత నియోజకవర్గంలో ఇఫ్తార్ పార్టీ లో పాల్గొన్నప్పటికీ కేశినేని నానీ ఆ ఇఫ్తార్ పార్టీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. టీడీపీ ని దెబ్బ తీయటం లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఏపీలో పార్టీని బలోపేతం చేసే గట్టి నాయకుల వేటలో ఉంది. అందులో భాగంగా కేశినేని నానీపై బీజేపీ ఆసక్తి చూపిస్తుంది. మొత్తానికి ఘోర ఓటమితో దెబ్బ తిన్న టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నానీ నిజంగానే గుడ్ బై చెబుతారా లేక అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇస్తారా అన్నది చూడాలి.