ఏం పిల్లడో హోదా ఇయ్యవా.. వంగపండు అవతారమెత్తిన ఎంపీ శివప్రసాద్.. రామ్మోహన్ నిరాహార దీక్ష
ఢిల్లీ : టీడీపీ ఎంపీల నిరసనతో పార్లమెంట్ ఆవరణ దద్ధరిల్లింది. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు చేతబట్టి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ తో పాటు విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరో వేషాధారణతో నిరసన గళం వినిపించారు. జానపద సుప్రసిద్ధుడు వంగపాడు వేషంతో ఫోక్ సాంగ్స్ పాడుతూ తనదైన శైలిలో మోడీపై ఆరోపణాస్త్రాలు సంధించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ నినదించారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం నిరంకుశ వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్షకు దిగారు. విభజన హామీల విషయంలో కూడా నిర్లక్ష్య ధోరణ అవలంభిస్తోందని ఆరోపించారు. ఈరోజు (మంగళవారం) పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. అయితే ఇవాళ ఆయన పుట్టినరోజు కావడం విశేషం.