ఢిల్లీ నుంచి రాష్ట్రానికి... తిరుగుముఖం పట్టిన టిడిపి ఎంపీలు
పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటికి గత రెండు రోజులుగా డిల్లీలోనే ఉండి వివిధ రకాలుగా ఆందోళనలు చేసిన టిడిపి ఎంపీలు తమ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు తిరిగి రాష్ట్రానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తమ పార్టీ ఎంపీల పోరాటంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు టిడిపి ఎంపీల అందోళన జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిందని ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ప్రతిజ్ఞ చేసిన టిడిపి ఎంపీలు రాష్ట్రానికి తిరుగు ప్రయాణమైనట్లు తెలిసింది. రాష్ట్రానికి తిరిగి వచ్చిన అనంతరం టిడిపి ఎంపీలు తమ పోరాట వేదికను ఢిల్లీ నుంచి ఎపి గల్లీలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా టిడిపి చేపట్టనున్న బస్సు యాత్రలో ఎంపీలు రాష్ట్రమంతా పర్యటిస్తారని తెలిసింది. అనంతరం పోరాట పంథాలను విస్తృతపరిచే విషయమై తమ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలతో సమావేశమై చర్చించి ఆ ప్రకారం ఆందోళన చేయాలని నిర్ణయించారట.
అయితే పోరాట పంథా ఏదైనా తమ నియోజకవర్గాలల్లో సభలు పెట్టి ఎపికి బిజెపి ఎపికి చేసిన అన్యాయం, అలాగే ప్రజల కోసం ఎపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, తదితర విషయాలు వివరించడం ఖాయమని తెలుస్తోంది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు ఇప్పటికే దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది.