ప్యాకేజీ అంటే పౌడర్ పాలు.. తల్లి పాలివ్వ లేనప్పుడు తప్పదు : శివప్రసాద్
విజయవాడ : పార్లమెంట్ సమావేశాల సందర్బంగా.. రోజుకో వేశంతో నిరసన తెలిపే ఏపీ ఎంపీ శివప్రసాద్ ప్రత్యేక హోదాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోదాను తల్లి పాలతోను, ప్యాకేజీని పౌడర్ పాలతోను పోల్చిన శివప్రసాద్.. తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా ఉండే పౌడర్ పాలను క్లిష్ట పరిస్థితుల్లో బిడ్డకు అందించాలన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
ఏపీ ప్రజానీకానికి ఇదొక గడ్డు కాలమని వ్యాఖ్యానించిన శివప్రసాద్.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలా? లేక ప్రత్యేక ప్యాకేజీ కావాలా? అన్నది ప్రజలు తేల్చుకోవాలన్నారు. ఓవైపు పాల కోసం బిడ్డ ఏడుస్తుంటే.. మరోవైపు పాలివ్వలేక తల్లి ఏడుస్తోందని.. ఇలాంటి స్థితిలో బిడ్డను బ్రతికించుకోవాలంటే పౌడర్ పాలను పట్టాల్సిన అవసరముందని సూచించారు శివప్రసాద్. మొత్తంగా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని స్వీకరించాల్సిందిగా ప్రజలకు హితవు పలికారాయన.