జగన్! ఆ క్షణమే రాజీనామా చేస్తాం, బాబు అలిగితే: శివప్రసాద్, ఇక బాబు కీలక నిర్ణయం!
చిత్తూరు/అమరావతి: హోదా కోసం ఏప్రిల్ 6వ తేదీన తమ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఎంపీ శివప్రసాద్ మంగళవారం గట్టి కౌంటర్ ఇచ్చారు.
Recommended Video
రాజీనామా చేసేందుకు తమకు నెల రెండు నెలల సమయం అవసరం లేదని తేల్చి చెప్పారు. ఏపీకి కేంద్రం న్యాయం చేయడం లేదని పూర్తిగా స్పష్టత వచ్చిన మరుక్షణమే తాము (టీడీపీ ఎంపీలు) రాజీనామా చేస్తామని చెప్పారు.
చంద్రబాబు అలిగితే ఎలా ఉంటుందో
హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తారన్న జగన్ ప్రకటనపై శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం కోసం తాము (టీడీపీ ఎంపీలు) ఎన్ని పోరాటాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసునని చెప్పారు. చంద్రబాబు అలిగితే పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసునని చెప్పారు.
టిడిపిని ఇరకాటంలోకి నెట్టిన జగన్
ప్రత్యేక హోదాపై కేంద్రం దిగి రాకుంటే ఏప్రిల్ 6న రాజీనామా చేస్తామని జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ మండిపడుతోంది. రాజీనామా ఓ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. రెండేళ్ల క్రితమే ఈ ప్రకటన చేసి ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే జగన్ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి టీడీపీ కూడా తనను ఫాలో కావాల్సిన పరిస్థితి తెచ్చారని అంటున్నారు.
అప్రమత్తమైన టీడీపీ
జగన్ ప్రకటన నేపథ్యంలో టీడీపీ అప్రమత్తమైంది. ఏపీకి అన్యాయం జరిగిందని స్పష్టమైన సంకేతాలు వచ్చిన మరుక్షణమే ఎంపీలు కీలక నిర్ణయం తీసుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాజీనామా అయినా, మరేదైనా చంద్రబాబు నిర్ణయిస్తారని చెబుతున్నారు.
జగన్పై టీడీపీ ప్రశ్నల వర్షం
జగన్ ప్రకటనపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాజీనామాలు ఓ డ్రామా అని, గత ఏడాది చెప్పి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలోనే ఈ డ్రామాకు తెరలేపారని, అన్యాయం జరిగిందని తెలిస్తే రాజీనామాకు నెల రెండు నెలల సమయం ఎందుకని, పోరాటంలో వెనుకబడ్డామనే రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారని టీడీపీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.