ఆ పని చేస్తే వైసీపీ కి మద్దతిస్తామన్న టీడీపీ ఎంపీ .. వైసీపీ ఆ పని చేస్తుందా ?
ఏపీలో రాజధాని వ్యవహారమే కాదు ఏపీకి సంబంధించిన ఏ అంశం అయినా సరే అది అధికార వైసీపీ విపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతుంది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఇక ఇదే సమయంలో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న కింజరాపు ఎర్రన్నాయుడి కుమారుడు టీడీపీ యువనేత శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో ఆ పని చేస్తే వైసీపీకి మద్దతు ఇస్తానని చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ప్రత్యేక హోదా విషయంలో ఏమీ సాధించలేకపోయిన వైసీపీ
ఏపీలో రాజధాని వ్యవహారం పార్లమెంట్ వేదికగా కూడా చర్చ జరుగుతుండగానే ఏపీ ప్రత్యేక హోదా అంశం జగన్ రాసిన లేఖతో తెరమీదకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చింది వైసీపీ . 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకునివస్తామని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికలసందర్భంగా ప్రకటన చేశారు. దీంతో ఏకంగా 22 మంది ఎంపీ సీట్లను రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఇచ్చారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఏమి సాధించలేకపోయింది.
ప్రత్యేక హోదా ఏ విధంగా సాధిస్తారో చెప్పాలన్న టీడీపీ ఎంపీ
వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రం రెండు బడ్జెట్లను కూడా ప్రవేశపెట్టింది. అయినా ఏపీకి ప్రత్యేక హోదా కాదు కదా... కనీస కేటాయింపులు కూడా లేవు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు పోరాడితే టీడీపీ ఎంపీలుగా తాము కూడా మద్దతు ఇస్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదా ఏ విధంగా సాధించుకుంటారో వైసీపీ ఎంపీలు చెప్పాలి అని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు .
వైసీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే మద్దతు ఇస్తామన్న టీడీపీ ఎంపీ
ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ ప్రతాపం కేంద్ర ప్రభుత్వం మీద చూపించాలని సూచించారు. ఇక, ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తే మేం మద్దతిస్తామని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రామ్మోహన్ నాయుడు. తొమ్మిది నెలల కాలంలో ఒక్కసారి కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు . ఇక ఇప్పటికే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్ర ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తున్నా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తారా అన్నది అనుమానమే .
వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తారా ?
ఆ విధంగా ఒత్తిడి తెస్తే కేంద్రంతో పంచాయితీ పెట్టుకున్నట్టు అవుతుంది. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా కోసమే కేంద్రంతో విబేధించి బయటకు వచ్చారు. దానికి ప్రతిగా నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక అలాంటి పరిస్థితి వైసీపీ నేతలు తెచ్చుకోరు కనుకే టీడీపీ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నిజంగా ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం చేస్తే మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. మరి టీడీపీ ఎంపీ చెప్పినట్టు వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తారా ? అన్నది వేచి చూడాల్సిందే .