ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్తో మరోసారి టీడీపీ ఎంపీల భేటీ:సిఎం లేఖ అందజేత
న్యూఢిల్లీ:కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ఉక్కు శాఖమంత్రి బీరేంద్రసింగ్ నుంచి సరైన స్పందన కరువైన నేపథ్యంలో టిడిపి ఎంపీలు మరోసారి ఆయనను కలిశారు. ఇదే విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను ఆయనకు అందజేశారు.
Recommended Video
కడప స్టీలు ప్లాంట్ ఏర్పాటు విషయమై బుధవారం ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్ ను కలసిన టిడిపి ఎంపీలకు ఆయన నుంచి ఎటువంటి హామీ లభించని సంగతి తెలిసిందే. దీంతో ఎపి ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు సూచనలతో పట్టువదలని విక్రమార్కుల్రా 24 గంటలు కూడా గడవక ముందే టిడిపి ఎంపీలు మరోసారి ఉక్కు శాఖా మంత్రి బీరేంద్ర సింగ్ ను కలిసారు.
కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని రకాల సహాయ, సహకారాలను అందజేస్తామని కేంద్రానికి హామీ ఇస్తూ సీఎం చంద్రబాబు రాసిన లేఖను కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ కు అందచేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్న అన్ని అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు మంత్రికి తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించేందుకు కాలపరిమితి స్పష్టం చేయాలని ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రిని కోరారు.
ఇదిలావుంటే టిడిపి ఎంపిలు ముందుగా ప్రధాని మోడీని కలసి కడప స్టీలు ప్లాంటు ఏర్పాటు విషయమై ఒక మెమొరాండం సమర్పించాలని భావించారు. అయితే టిడిపి ఎంపీలకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వారి ప్రయత్నం నెరవేరలేదు. ప్రధాని కనీసం 5 నిమిషాల సమయం తమకు కేటాయించకపోవడంపై టిడిపి ఎంపీలు అవమానకరంగా భావిస్తున్నారు. ప్రధాని మోడీ ఉద్దేశ్యపూర్వకంగానే తమను అవమానించారని వారు భావిస్తున్నట్లు తెలిసింది.