అందరం రాజీనామా చేస్తే దేశంలో ప్రకంపనలే.. టీడీపీ సిద్దమా?: ఎంపీ మిథున్ రెడ్డి
హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం పార్టీలకు అతీతంగా రాజకీయ పోరాటం జరగాలని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆకాంక్షించారు. కేంద్రం హోదాపై ప్రకటన చేయకపోతే రాజీనామాలకు తాము సిద్దంగా ఉన్నామని, చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కూడా తమతో కలిసి రావాలని కోరారు.
అమరావతిలో కూర్చుని చంద్రబాబు అఖిలపక్షం పెడితే ఏం లాభమని, అందరం కలిసి రాజీనామాలు చేస్తేనే కేంద్రంపై ఒత్తిడి సాధ్యమవుతుందని మిథున్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై 25 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా ప్రకంపనలు వస్తాయన్నారు.
రాజకీయ విభేదాలు ఉంటే తర్వాత చూసుకుందామని, ఇప్పుడైతే హోదా కోసం కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులను వదులుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఉపఎన్నికలు వస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని, రాజస్థాన్, కర్ణాటకలోనూ అలాగే జరిగిందని గుర్తుచేశారు.
వైఎస్ జగన్ అవిశ్వాస తీర్మానం ప్రకటించడమే కేంద్రాన్ని ఒక కుదుపు కుదిపిందన్నారు. జగన్ ముందడుగు వల్లే ఈరోజు మిగతా పార్టీలు కూడా ఆ దిశగా కదిలాయని అన్నారు. ఒకవేళ టీడీపీ ఎంపీలు గనుక రాజీనామాలు చేయకపోతే లాలూచీ పడినట్టేనని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదాపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, ముందుగా ప్రకటించినట్లే తాము ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమకంటే ముందు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసిన మాకేమి అభ్యంతరం లేదన్నారు మిథున్ రెడ్డి.