ఏపీలో రౌడీ రాజ్యం..: కేంద్ర హోం మంత్రికి టీడీపీ ఫిర్యాదు: జగన్ పాలనపైన అమిత్ షా స్పందనతో...!
చాలా రోజుల తరువాత బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. గత ఏడాది ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చిన తరువాత నుండి బీజేపీ నేతలతో దూరంగా ఉంటున్నారు. ఇక, కొద్ది రోజులు తిరిగి వారికి దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా మతపరమైన విమర్శలు చేస్తున్నాయనే వాదన ఉంది. ఇక, తాజా గా ఇండియా మ్యాప్ లో అమరావతికి స్థానం కల్పించటం పైన చంద్రబాబు సైతం అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశం పైన టీడీపీ ఎంపీలు లోక్ సభ ప్రాంగణంలో అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం పైనా ఫిర్యాదు చేసారు. దీనికి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
అమిత్ షా తో టీడీపీ ఎంపీల భేటీ
బీజేపీ జాతీయాధ్యక్షుడు..కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. భారత రాజకీయ పటంలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పేరును చేర్చినందుకు టీడీపీ ఎంపీలు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రాసిన లేఖను ఆయనకు ఇచ్చారు. టీడీపీపీ నేత గల్లా జయదేవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, తోట సీతారామలక్ష్మి పార్లమెంటు భవన్లోని అమిత్ షా చాంబర్లో ఆయనతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఏపీలో పాలనా అంశాల మీద వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అమిత్ షా వారితో సన్నిహితంగా మాట్లాడారని..తాము చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నారని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.
ఏపీలో రౌడీ రాజ్యం..భద్రత లేదు
అమిత్ షా ను కలిసిన సమయంలో టీడీపీ ఎంపీలు ఏపీలోని రాజకీయ అంశాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్ మీద ఫిర్యాదు చేసారు. ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం ఏలుతోందని..సామాన్య ప్రజలతోపాటు విపక్ష నేతలు..కార్యకర్తలకు సైతం భద్రత లేకుండా పోయిందని టీడీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ.. తిరిగి తమ పైనే తప్పుడు కేసులు పెడుతున్నారని అమిత్ షా కు వివరించారు. సీఎం జగన్ పోలీసులపై తెచ్చిన ఒత్తిడి తెస్తున్నారని..తమ పార్టీ శ్రేణులను వేధిస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనిజజ. ఏపీలో మానవ హక్కులు లేవంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
నాకు తెలుసు..నేను చూసుకుంటా..
టీడీపీ ఎంపీలు చెప్పిన అన్ని అంశాలను అమిత్ షా జాగ్రత్తగా విన్నారని..సానుకూలంగా స్పందించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో రాజకీయ వేధింపుల పైన టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసిన సమయంలో..అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ఏం జరుగుతుందో తనకు తెలుసని... తాను చూసుకుంటానంటూ బదులిచ్చినట్లు టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వ అవినీతి.. అరాచకాల మరిన్ని వివరాలతో మరొకసారి కలుస్తామని చెప్పగా... మీరు ఎప్పుడైనా రావొచ్చు. కలవొచ్చు అని అమిత్ షా చెప్పారని..టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇక, దీని ద్వారా ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా మరిన్ని ఫిర్యాదులు చేయటానికి టీడీపీ నేతలు సిద్దం అవుతున్నారు. దీని ద్వారా రాజకీయంగా బీజేపీ..టీడీపీ అదే విధంగా వైసీపీ ..బీజేపీ మధ్య ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.