ప్రత్యేక హోదాపై జైట్లీతో టిడిపి ఎంపీల భేటీ: 'ఇప్పటిదాకా జగన్ ఎక్కడ?'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందిగా కోరారు.
మంగళవారం సాయంత్రం 4.30కు హోంమంత్రి రాజనాథ్తో టిడిపి ఎంపీలు భేటీ కానున్నారు. అదేవిధంగా ప్రత్యేక హోదా విషయమై ఎంపీలు ప్రధాని మోదీతో చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరారు. నేడు లేదా రేపు టీడీపీ ఎంపీలకు ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఇప్పుడు మాట్లాడడంలో ఆశ్చర్యం లేదని, ఇప్పటి వరకు జగన్ ఎక్కడ ఉన్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జేడీ శీలం అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం పర్యటన తర్వాత జగన్ హోదా గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. జగన్ గేమ్ ఆడుతున్నారని, వైసీపీని సమర్థిస్తున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఈ విషయం తెలుసుకోవాలని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆ పార్టీ నేత జేడీ శీలం మీడియాతో మాట్లాడారు. హోదాపై గట్టిగా మాట్లాడే విషయలో మీరెందుకు భయపడుతున్నారని, తాము గట్టిగా మాట్లాడిన తర్వాత ఈ ప్రభుద్ధులందరూ వచ్చి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదని, దీన్ని ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇప్పటికైనా కుతంత్ర రాజకీయాలు మానుకుని అందరం కలిసి తెలుగు ప్రజల తరఫున పోరాడి మన హక్కును సాధించుకుందామని ఆయన పిలుపు ఇచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్త మునికోటి మృతి చాలా విషాదకరమని, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని శీలం అన్నారు. ఇకముందైనా ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోకుడదని, పోరాటం ద్వారా మన హక్కులను సాధించుకుందామని ఆయన అన్నారు. ప్రజల ఆవేదన మీరక ముందే కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని శీలం విజ్ఞప్తి చేశారు.