'కాంగ్రెస్ను బాబు కలవరు, మోడీ ఎలా వంచించారో చెప్తారు': బాబు అంత తెలివితక్కువవాడు కాదని జేసీ
Recommended Video
న్యూఢిల్లీ: టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన వివిధ పార్టీల నేతలను కలుసుకొని ధన్యవాదాలు తెలిపేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్, రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్ తదితరులు మంగళవారం అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని, చర్చకు పట్టుబడతామని చెప్పారు. కేంద్రం చర్చకు ముందుకు రావడం లేదన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన వివిధ పార్టీల నేతలను చంద్రబాబు కలిసి ధన్యవాదాలు చెబుతారన్నారు. విభజన చట్టం, హామీల అమలు, హోదాపై రూపొందించిన వివరణ పత్రాన్ని అన్ని పార్టీల నేతలకు చంద్రబాబు ఇస్తారని చెప్పారు.
పార్లమెంటు సెంట్రల్ హాల్కు బాబు, కాంగ్రెస్ను కలవడంపై సందిగ్ధం!: బీజేపీ సహా విపక్ష నేతలతో భేటీ!!
న్యాయం జరిగేదాకా పోరాటం
నాలుగేళ్లుగా చంద్రబాబు 29సార్లు ఢిల్లీకి వచ్చారని, రాష్ట్ర సమస్యలపై కేంద్రం పెద్దలను కలిసినా చలనం లేదని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు బీజేపీ భయపడుతోందన్నారు. బీజేపీకి జాతీయ భావం లోపించిందని, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలను తప్ప
ఏపీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలను తప్ప అవిశ్వాసానికి మద్దతు తెలిపిన వివిధ పార్టీ ఫ్లోర్ లీడర్లతో, నేతలతో చంద్రబాబు భేటీ అవుతారని, వారికి ధన్యవాదాలు తెలుపుతారని చెప్పారు.
కేంద్రం వైఖరి ఎండగట్టేందుకు ఢిల్లీకి
ఏపీ హక్కులను సాధించుకునే క్రమంలో కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని మరో ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. సోమవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారని, ఈ రోజు పార్లమెంటులో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఆయన కలుస్తారన్నారు. బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన ఏ ఒక్క నాయకుడితో ఆయన భేటీ కాబోరని తెలిపారు. ఈ రెండు పార్టీలను మినహాయించి ఇతర అన్ని పార్టీల నేతలో బాబు సమావేశమవుతారన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాన్ని ఎలా వంచించాయో చెబుతారు
ఈ సందర్భగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని ఏ విధంగా వంచించాయో చంద్రబాబు వివరించనున్నారని గల్లా జయదేవ్ తెలిపారు. రాష్ట్ర విభజన ఎలా జరిగింది, 2014 ఎన్నికల తర్వాత విభజన హామీలకు బీజేపీ ఎలా తూట్లు పొడిచిందో తెలియజేస్తారని చెప్పారు. ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ఎలా నాశనం చేస్తోందో చర్చించనున్నారన్నారు.
అవిశ్వాసం చర్చకు రాదు, బాబు తెలివితక్కువ వాడు కాదు
లోకసభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశమే లేదని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తమకు మద్దతు కోసం మిగతా పార్టీలను కలుస్తున్నామని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని అందరికీ వివరిస్తామన్నారు. రెండు జాతీయ పార్టీలు కూడా అన్యాయం చేశాయన్నారు. అయినా ఏపీ కోసం అందరి మద్దతు కోరుతున్నామని అభిప్రాయపడ్డారు. అవిశ్వాసం చర్చకు రాదనే విషయం చంద్రబాబుకు తెలుసునని, అంత తెలియనంత తెలివితక్కువ వాడు కాదని జేసీ అన్నారు. ఆర్థిక సాయం కోసం చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని, ఇది రాజకీయ పర్యటన కాదని, అవసరాన్ని బట్టి బీజేపీ, కాంగ్రెస్ నేతలను కలుస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అందరి విపక్ష నేతలను కలుస్తారని, ప్రధాని మోడీ నైజాన్ని వివరిస్తారని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు అన్నారు. విజయసాయి రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు.